సృష్టిలో అన్ని బంధాల కంటే స్నేహబంధం గొప్పది..

by Disha Web Desk 20 |
సృష్టిలో అన్ని బంధాల కంటే స్నేహబంధం గొప్పది..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : సృష్టిలో అన్ని బంధాల కంటే స్నేహబంధం చాలా గొప్పదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991- 92 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు 31 సంవత్సరాల అనంతరం కలుసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులకు జ్ఞాపికలను బహుకరించారు. దీనికి ముందు తమకు పాఠాలు బోధించి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ, గురువులను గౌరవించినట్లే తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ, వారికి దగ్గర ఉండి సేవలందించాలని సూచించారు. తమ పిల్లలకు కూడా తల్లిదండ్రులను గౌరవించేలా మంచి అలవాట్లు నేర్పించాలన్నారు. 1991 - 92 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులందరూ తమ తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఉల్లాసంగా గడిపారు. తమ తోటి చదివిన స్నేహితులకు మెమెంటోలను అందజేసి, ఆత్మీయ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విట్టల్ రెడ్డి, శ్రీనివాస చారి, మల్లా గౌడ్, నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, పూర్వ విద్యార్థులు మసియోద్దీన్, సురేందర్ రెడ్డి, అంబరీష్, రూపేందర్ రెడ్డి, రాజ్ కుమార్, కిరణ్ కుమార్, ఆశయ్య, గణేష్, గుణశ్రీ, అరుణ, జమున, సుమలత, పరమేశ్వరీ, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed