ఎల‌క్ట్రిక్ స్కూటీని ఢీ కొట్టిన లారీ.. యువకుడు మృతి

by Ratna Kumari |

ఎల‌క్ట్రిక్ స్కూటీ పై వ‌స్తున్న ఓ యువ‌కుడిని లారీ ఢీ కొట్ట‌డంతో అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు.

ఎల‌క్ట్రిక్ స్కూటీని ఢీ కొట్టిన లారీ.. యువకుడు మృతి
X

దిశ‌, భిక్క‌నూరు : విధులు ముగించుకొని క‌ర్రీ తీసుకురావ‌డానికి వ‌స్తున్న యువ‌కుడిని లారీ ఢీ కొట్టింది. దీంతో ఆ యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని 44వ హైవేపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ఆంజ‌నేయులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చలిమెడకు చెందిన రాజ శేఖర్ (28) అనే యువకుడు, సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలోని హైవే పై ఉన్న పెట్రోల్ బంకులో పని చేస్తాడు. డ్యూటీ దిగి గదికి వెళ్ళాడు. అన్నం ఉన్నప్పటికీ కర్రీస్ లేకపోవడంతో, అవి తేవడానికి ఎలక్ట్రిక్ స్కూటీ పై బయలుదేరాడు. ఈయన ప్రయాణిస్తున్న స్కూటీని, అదే దారిలో వెనకాల నుంచి వస్తున్న ట్యాంకర్ లారీ వెనకాల నుంచి వచ్చి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కొన ఊపిరితో ఉన్నాడని భావించి అప్పుడే ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందాడు. మృతునికి మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నట్లు స‌మాచారం. ఈ మేరకు ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలోని పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి త‌ర‌లించారు.

Next Story