నిజామాబాద్ జిల్లాలో 70 శాతం ధాన్యం సేకరణ పూర్తి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

by Disha Web Desk 1 |
నిజామాబాద్ జిల్లాలో 70 శాతం ధాన్యం సేకరణ పూర్తి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రైతుల ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు అంకితభావంతో పని చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం తరలింపు విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రధానంగా రైస్ మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను వెంట వెంటనే అన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. ఏ ఒక్క రైస్ మిల్లు వద్ద కూడా జాప్యం జరుగకుండా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ పురోగతిని సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, వాటి తరలింపు తదితర వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 70 శాతం ధాన్యం సేకరణ పూర్తయ్యిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

గుండారంలోని జై గణేష్ ప్యాడీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, శ్రీకృష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ తో పాటు పార్వతి రైస్ మిల్, ఆర్.కె మోడర్న్ రైస్ మిల్, సిద్ధిరామేశ్వర రైస్ మిల్, శ్రీరామ మోడర్న్ తదితర రైస్ మిల్లుల వద్ద 48 గంటలకు పైగా ధాన్యం అన్లోడింగ్ జరగని వాహనాలు ఒకింత ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని మంత్రి గుర్తించారు. అనంతరం సంబంధిత క్లస్టర్ల పరిధిలో పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ తహసీల్దార్లను సమీక్షా సమావేశం నుండే ఫోన్ ద్వారా సంప్రదించి అన్ లోడింగ్ లో జాప్యానికి గల కారణాలను ఆరా తీశారు.

రెండు, మూడు రోజుల పాటు ధాన్యం అన్ లోడింగ్ నిలిచిపోతే మీరేం చేస్తున్నారంటూ మంత్రి మందలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ లోడింగ్ ప్రక్రియలో జాప్యం జరగడానికి వీలు లేదని, అవసరమైన చోట హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయిన బాన్సువాడ, బోధన్ ప్రాంతాల్లోని 61 కొనుగోలు కేంద్రాల పరిధిలో పని చేసిన హమాలీల సేవలను రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, డీ.ఎస్.వో చంద్రప్రకాష్, డీఆర్డీవో చందర్, మెప్మా పీడీ రాములు, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జగదీశ్, డీసీవో సింహాచలం, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్ పోర్ట్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Next Story