సేవాలాల్ మహారాజ్ ఒక మహా శక్తి : స్పీకర్ పోచారం

by Disha Web Desk 20 |
సేవాలాల్ మహారాజ్ ఒక మహా శక్తి : స్పీకర్ పోచారం
X

దిశ, బాన్సువాడ : గిరిజనుల ఆరాధ్యదైవం సేవాలాల్ మహారాజ్ ఒక వ్యక్తి కాదని, ఆయన ఒక మహా శక్తి అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్ లో గురువారం జరిగిన బాన్సువాడ నియోజకవర్గ స్థాయి "సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి" అధికారిక ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుపుకుంటున్న గిరిజన సోదర, సోదరీమణులకు పేరుపేరునా అభినందనలు, శుభాకాంక్షలను తెలియజేశారు.

తెలంగాణ వచ్చాక సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, సేవాలాల్ మహారాజ్ మీద గౌరవంతో రాష్ట్రముఖ్యమంత్రి ఆయన జయంతిని అధికారికంగా జరుపుతున్నారన్నారు. సేవాలాల్ మహారాజ్ వ్యక్తి కాదు శక్తి, స్వయంగా దేవుడని, ఎన్నో మహిమలు, అద్భుతాలు చేశారన్నారు. ఆయన జన్మించింది బంజారా కుటుంబంలో అయినా సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని, అందరికీ దేవుడయ్యారన్నారు. నియోజకవర్గంలోని ప్రతితాండాలో శ్రీ జగదాంబ, శ్రీ సేవాలాల్ మహారాజ్ ల గుడులకు నిధులను మంజూరు చేసి నిర్మించుకున్నామన్నారు. ఇందుకోసం రూ. 7 కోట్ల నిధులను ఖర్చు చేశామన్నారు.

బాన్సువాడ నియోజకవర్గానికి నూతనంగా గిరిజన బాలికల గురుకుల పాఠశాల మంజూరు అయిందని, బాన్సువాడ గ్రామీణ మండలం హన్మాజిపేట-కోనాపూర్ గ్రామాల వద్ద ఏర్పాటు చేయడానికి జీవో జారీ చేశారన్నారు. భవనాలు, ఇతర వసతుల కోసం రూ. 43 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం అవుతాయని ఆయన తెలియజేశారు. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని, ముఖ్యమంత్రి హామీ మేరకు త్వరలోనే సర్వేలు పూర్తి చేసి అర్హులకు పట్టాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్డివో రాజగౌడ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, బంజారా నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed