చోరీ అయిన, పోగొట్టుకున్న సెల్​ ఫోన్ల స్వాధీనానికి కొత్త టెక్నాలజీ

by Disha Web Desk 12 |
చోరీ అయిన, పోగొట్టుకున్న సెల్​ ఫోన్ల స్వాధీనానికి కొత్త టెక్నాలజీ
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: చోరీ అయిన, పోగొట్టుకున్న మొబైల్​ఫోన్ల జాడను తెలుసుకునేందుకు సెంట్రల్​ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్​(సీఈఐఆర్) విధానాన్ని అమల్లోకి తీసుకు వస్తున్నట్టు డీజీపీ అంజనీకుమార్​చెప్పారు. ఈ విధానం పని తీరుపై అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్​ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీకుమార్​మాట్లాడుతూ ప్రజలు అత్యధికంగా ఉపయోగించే ఎలక్ర్టానిక్​గ్యాడ్జెట్​సెల్​ఫోన్​అని చెప్పారు. ఈ క్రమంలో సెల్​ఫోన్​చోరీలు ఏయేటికాయేడు గణనీయంగా పెరిగిపోతున్నాయన్నారు. ఇక, మొబైల్​ఫోన్లను పోగొట్టుకుంటున్న వారి ఫిర్యాదులు కూడా పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే చోరీ అయిన, కనిపించకుండా పోయిన సెల్​ఫోన్లను కనుగొని స్వాధీనం చేసుకునేందుకే సీఈఐఆర్​విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు తెలిపారు.

దీనిపై పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మే 17న ప్రపంచ టెలికాం దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు చెప్పారు. అదనపు డీజీపీ మహేశ్​భగవత్​మాట్లాడుతూ రాష్ట్రంలోని 750 పోలీస్​ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులకు ఈ విధానంపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సెల్​ఫోన్​వాడే ప్రతి ఒక్కరికి సీఈఐఆర్​ గురించి తెలిసేలా బ్లూకోల్ట్స్ ​పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సెల్​ఫోన్​పోయిందనో… చోరీ అయ్యిందనో ఎవరైనా స్టేషన్​కు వస్తే రిసెప్షన్​లో ఉండే సిబ్బంది సీఈఐఆర్​యాప్​లో పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలా చేస్తే మొబైల్​ఫోన్లు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఈ యాప్​ను అందుబాటులోకి తెచ్చిందని చెబుతూ దీనికోసం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.సీఈఐఆర్.జీవోవీ.ఇన్​అన్న వెబ్​సైట్​కి లాగిన్​కావాల్సి ఉంటుందన్నారు.

దీంట్లోకి వెళ్లిన తర్వాత ఐఏంఈఐ నంబర్, కంపెనీ పేర, మోడల్, కొన్న బిల్లును అప్లోడ్ ​చేయాల్సి ఉంటుందన్నారు. ఫోన్​ఎక్కడ పోయింది? ఏ స్టేషన్​లో ఫిర్యాదు చేశారన్న వివరాలను నమోదు చేయాలని చెప్పారు. చివరగా వినియోగదారుని పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ మెయిల్​ఐడీ, ఓటీపీ కోసం మరో మొబైల్​నెంబర్​ను అప్​లోడ్​చేయాలని సూచించారు. దీనివల్ల పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ ​ఫోన్లు తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్​లో టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్​జనరల్​రాజశేఖర్, డైరెక్టర్లు మురళీకృష్ణ, రాఘవరెడ్డి, అదనపు డీజీలు అనిల్​కుమార్, షికాగోయల్, సంజయ్​కుమార్​జైన్, శివధర్​రెడ్డి, అభిలాష్​బిస్త్, ఐజీలు కమలాసన్​రెడ్డి, చంద్రశేఖర్​రెడ్డి, షానవాజ్​ఖాసీం, డీఐజీ రమేష్​రెడ్డి, ఎస్పీలు లావణ్య, విజయ్​కుమార్​పాల్గొన్నారు.

Next Story

Most Viewed