తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలి

by Disha Web Desk |
తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అనేక భూ సమస్యలు పెరిగాయని, అనేకం అపరిష్కృతంగా ఉండడంతో లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధరణి సమస్యల పరిష్కార వేదిక కన్వీనర్, సామాజిక కార్యకర్త మన్నె నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తులన్నీ పెండింగులోనే ఉంచుతున్నారని, తహశీల్దార్లపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. అందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. కొత్తగా 25 డివిజన్లు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన సౌలభ్యంగా ఉంటుందన్నారు. కొత్త డివిజన్లతో ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు. ప్రస్తుతం ఆర్డీవోలను కలిసేందుకు రైతులు, భూమి హక్కుదారులు 50-60 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెవెన్యూ డివిజన్లు 20 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉండాలన్నారు. పైగా కొన్ని డివిజన్లలో ఎక్కువ మండలాలు ఉన్నాయని గుర్తు చేశారు.

తెలంగాణలోని కొన్ని డివిజన్లలో పదికి పైగా మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్-14, కొత్తగూడెం-11, జగిత్యాల-11, భూపాలపల్లి- 11, గద్వాల్-11, కరీంనగర్-10, ఖమ్మం- 15, మహబూబ్‌నగర్-16, మహముదాబాద్-10, దేవరకొండ-10, మిర్యాలగూడ- 10, నారాయణపేట్- 12, నిర్మల్- 12, ఆర్మూర్- 11, నిజామాబాద్ –10, పెదపల్లి- 10, సంగారెడ్డి-11, సూర్యాపేట - 11, వికారాబాద్ - 11, వనపర్తి - 14, భువనగిరి -12 మండలాల వంతున ఉన్నాయన్నారు. ఎక్కువ మండలాలు ఉండడం వల్ల ప్రజలకు సరైన సేవలు అందడం లేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి కొత్త రెవెన్యూ డివిజన్లను సత్వరం ఏర్పాటు చేయడం ద్వారా భూ సమస్యల పరిష్కారం, ఇతర సర్వీసులు సకాలంలో అందేటట్లు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed