తెరపైకి కొత్త పేర్లు.. చొప్పదండి టికెట్ దక్కేదెవరికో?

by Disha Web Desk 4 |
తెరపైకి కొత్త పేర్లు.. చొప్పదండి టికెట్ దక్కేదెవరికో?
X

దిశ, రామడుగు : ఎన్నికల వేళ ఆశావహుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. చొప్పదండి బీఆర్ఎస్ టికెట్‌ అంశంలో ప్రతిసారి కొత్త వ్యక్తి తెరపైకి వస్తున్నాడు. గతంలో ఎమ్మెల్యే బొడిగె శోభకు కేటాయించిన ఈ టికెట్ తదుపరి ఎన్నికలలో గందరగోలాల నడుమ సుంకే రవిశంకర్‌కు కేటాయించడంతో బీఆర్ఎస్ నాయకుల అండతో భారీ విజయాన్ని చేజిక్కించుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం సీఎం సర్వేలో కొందరి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు కష్టమే అని తేలడంతో 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆశావాహులు బడా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మూడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వేషన్‌లో ఉన్నాయి. అందులో చొప్పదండి, ధర్మపురి, మానకొండూర్ నియోజకవర్గం ఎస్సీ వర్గానికి కేటాయించారు. చొప్పదండి నియోజకవర్గంలో 2018లో సుంకే రవిశంకర్‌కు బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంతో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలుపొందినప్పటి నుంచి నేటి వరకు చొప్పదండి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

‘పొద్దు పొడుపు’తో ప్రజల్లోకి...

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో పొద్దు పొడుపు కార్యక్రమం చేపట్టి స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందిస్తున్నారు. చెక్కులతోపాటు ఎమ్మెల్యే సతీమణి దీవెన సొంత ఖర్చులతో ఆడపడుచులకు చీరెలను ఎమ్మెల్యే ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. పొద్దుపొడుపు కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నియోజకవర్గంలోని ఏదో ఒక మండలానికి వెళ్లి ప్రజలతో మమేకం అవుతున్నారు. సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే టికెట్ కేటాయిస్తారని ఇప్పటికే ప్రకటించారు. దీంతో సిట్టింగ్ స్థానంతో పాటు స్థానికత కలిసి వస్తుందని ధీమాతో ఎమ్మెల్యే రవిశంకర్ ఉన్నారు.

తెరపైకి కొత్త ముఖాలు..

చొప్పదండి బీఆర్ఎస్ టికెట్ రేసులో మరి కొంతమంది స్థానికేతర నాయకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ పట్టణానికి చెందిన కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ మంత్రి గంగుల అనుచరుడుగా పేరుపొందారు. శ్రీనివాస్ రెండోసారి కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే చొప్పదండి నియోజకవర్గంలో పలువురితో గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ధర్మపురి నియోజకవర్గంలోని పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు గజ్జల కాంతం పోటీ పడుతున్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లి ఈసారి చొప్పదండి టికెట్ తనకే ఇవ్వాలని అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున చొప్పదండికి టికెట్ ఆశించినప్పటికీ టికెట్ కేటాయించలేదు. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్‌లో చొప్పదండి టికెట్ కోసం వేట మొదలుపెట్టారు. ఇక ఇదే పెగడపల్లి మండలానికి చెందిన ఇరుగురాల ఆనంద్ రాష్ట్ర అంబేద్కర్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు. గతంలో పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మండల జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు.

బీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి కొప్పుల ఈశ్వర్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. కొప్పుల చొరవతో టికెట్ ఆశిస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బోయినపల్లి మండల జెడ్పీటీసీగా ప్రస్తుతం పదవిలో ఉన్న కత్తెరపాక ఉమ భర్త కత్తెరపాక కొండయ్య కూడా రాజ్యసభ సభ్యులు జోగిని పల్లి సంతోష్ కుమార్, మంత్రి కేటీఆర్ చొరవతో పలుమార్లు టికెట్ కోసం ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ అత్తగారి మండలమైన బోయినపల్లి గ్రామస్తుడు కావడంతో కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయిస్తానని సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికే రెండుసార్లు సర్వేలు చేయించారు. మళ్లీ మరో వారం రోజులలోపు మరొకసారి చేయిస్తానని సీఎం చెప్పటం వెనుక ఆంతర్యం ఏమిటోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed