ఏఐ, డ్రోన్లు, ఫార్మింగ్‌తో వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తేవాలి: మంత్రి తుమ్మల

by Malleboina Mahesh |

వ్యవసాయ రంగంలో ఏఐ, డ్రోన్లు, ప్రెసిషన్ ఫార్మింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలను పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

ఏఐ, డ్రోన్లు, ఫార్మింగ్‌తో వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తేవాలి: మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ విశ్వవిద్యాలయం పంట ఉత్పత్తి పెంపు పై కాకుండా పంటలకు విలువ పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) సూచించారు. రైతు ఆదాయం పెరగాలంటే విలువ ఆధారిత వ్యవసాయం, మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఆదేశించారు. శుక్రవారం జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరై ప్రసంగించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

విశ్వవిద్యాలయం 525 పంట రకాలను అభివృద్ధి చేసిందని, తెలంగాణ సోనా, బీపీటీ-5204, ఎంటీయూ-1010 వంటి వరి రకాలు, డీహెచ్‌ఎం సిరీస్ మొక్కజొన్న సంకర రకాలు దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ పొందాయని తెలిపారు. వేలాది మంది వ్యవసాయ పట్టభద్రులు, పరిశోధకులను తయారు చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిందన్నారు. రైతు నేస్తం, డ్రోన్ అకాడమీ, అగ్రి హబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలతో విశ్వవిద్యాలయం భవిష్యత్ వ్యవసాయానికి కేంద్రబిందువుగా మారుతుందన్నారు.

ప్రపంచ వ్యవసాయం ప్రస్తుతం ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లు, ప్రెసిషన్ అగ్రికల్చర్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, తెలంగాణ కూడా ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో కార్బన్ క్రెడిట్స్, బయో ఎకానమీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి రంగాలు రైతులకు కొత్త ఆదాయ వనరులుగా మారనున్నాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ ఆధారిత, సాంకేతిక ఆధారిత, మార్కెట్ ఆధారిత వ్యవసాయం గా రూపాంతరం చెందాలని, ఆ మార్పుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు.

Next Story