గతేడాది 8.. ఈ ఏడాది 10.. మరీ 9 ఏం పాపం చేసిందంటూ సర్కార్‌పై నెటిజన్ల సెటైర్లు!

by Disha Web Desk 19 |
గతేడాది 8.. ఈ ఏడాది 10.. మరీ 9 ఏం పాపం చేసిందంటూ సర్కార్‌పై నెటిజన్ల సెటైర్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.దశాబ్ది ఉత్సవాల పేరుతో జూన్ 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజు వారీగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి తెలిసే విధంగా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసి ఆచరణలో పెట్టింది.

అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ ఉత్సవాలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటే పదేళ్ల సంబరాలు ఎలా జరుపుకుంటారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడితే ఇప్పటి వరకు లెక్కిస్తే తొమ్మిదేళ్లు పూర్తవుతుందని అలాంటప్పుడు దశాబ్ది పేరుతో ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారని మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటే గతేడాది జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం జారీచేసిన ప్రకటనలో 8వ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపింది. ఈఏడాదికి వచ్చేసరికి పదేండ్ల నా తెలంగాణ అంటూ ప్రకటన జారీ చేసింది. దీంతో 2022లో 8 వసంతాలు అయితే.. 2023 లో 10 ఎట్లా అవుతుందని మధ్యలో 9వ ఏడాది ఎటు పోయింది? అదేం పాపం చేసిందని విమర్శిస్తున్నారు. కాగా తొమ్మిదవ ఏటానే పదో ఏడాది ఉత్సవాలు జరపడం వెనుక బీఆర్ఎస్ పొలిటికల్ ఎజెండా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడం వల్లే గ్రామాల్లో బీఆర్ఎస్‌ను ప్రచారం చేసుకునేందుకే దశాబ్ది ఉత్సవాల పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.


Next Story