జగిత్యాలలో దారుణం.. ఆపరేషన్ చేసి కడుపులో బట్టను వదలిన వైద్యులు

by Disha Web Desk 2 |
జగిత్యాలలో దారుణం.. ఆపరేషన్ చేసి కడుపులో బట్టను వదలిన వైద్యులు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ఎంసీహెచ్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన మరొకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదివరకే తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా ఆరుగురు బాలింతలు మృతి చెందడం, నవజాత శిశువులు సైతం పురిట్లోనే కన్నుమూయడం వంటి సంఘటనలతో తరచూ వివాదాస్పదమవుతున్న ఆసుపత్రి మరోసారి అపఖ్యాతి మూటగట్టుకుంది. 18 నెలల క్రితం పురిటి కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలోనే కర్చీఫ్( కాటన్ గుడ్డ) ఉంచి కుట్లు వేయడంతో సంవత్సరంనర కాలంగా సదరు మహిళ నరకయాతనను అనుభవిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవ్య శ్రీ అనే బాలింత డెలివరీ కోసం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నమిలకొండలో గల పుట్టింటికి వచ్చింది. డెలివరీ కోసం జగిత్యాల ఎంసీహెచ్‌లో 29 డిసెంబర్ 2021 రోజున నవ్య శ్రీ అడ్మిట్ అయింది. ఈ క్రమంలో నవ్యశ్రీకి సర్జరీ చేసిన వైద్యులు ఆపరేషన్ తర్వాత కాటన్ గుడ్డను పొట్ట లోపలనే మరిచిపోయి కుట్లు వేశారు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నవ్యశ్రీ నెల రోజుల తర్వాత నుండి కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలిపింది. సంవత్సరాలు గడుస్తున్నా కొద్ది బాధ ఎక్కువ కావడంతో భరించలేని స్థితిలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించగా పొట్టలో కాటన్ గుడ్డ ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి కాటన్ గుడ్డను తొలగించారు. జగిత్యాల ఎంసీహెచ్ వైద్యుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేసిన బాధితురాలు బంధువులు జిల్లా కలెక్టర్‌కు వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed