మాట తప్పం.. మడమ తిప్పం: ఎమ్మెల్యే

by Disha Web Desk 22 |
మాట తప్పం.. మడమ తిప్పం: ఎమ్మెల్యే
X

దిశ, చౌటుప్పల్ టౌన్: నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు తాను చిత్త శుద్ధితో పనిచేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మాట తప్పం.. మడమ తిప్పం అన్నట్లుగా పని చేస్తున్నానని వెల్లడించారు. మునుగోడు నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ. 431 కోట్లతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నియోజకవర్గానికి నిధులు తేలేదని.. ఏ ఒక్క గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేపట్టింది లేదు.. శిలాఫలకం వేసింది లేదని ఆరోపించారు. మునుగోడులో ఉప ఎన్నిక రావడం తమ అదృష్టంగా భావించిన ప్రజలు మళ్లీ తనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని తెలిపారు. ఈ లక్ష్యంతోనే జై-కేసారంలో రూ. కోటి 50 లక్షల నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు గ్రామానికి వస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ గ్రామంలో నిధులు ఖర్చు పెడితే తమ ఉనికి ఉండదని కాంగ్రెస్ నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. కలలో కూడా ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయన్నారు. అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి అడ్డుకోవడం అనేది కళ్లు కాబోజీలు చేసే పనిలా ఉందని ఎమ్మెల్యే విమర్శించారు.

Next Story

Most Viewed