తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు.. ఎన్నికల వేళ కలకలం..!

by Kavya |
తుంగతుర్తి కాంగ్రెస్‌లో వర్గపోరు.. ఎన్నికల వేళ కలకలం..!
X

దిశ, వెబ్ డెస్క్: తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సూర్యాపేటలో జరిగిన జిల్లా స్థాయి సమావేశం రణరంగంగా మారింది. ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా పాత కాంగ్రెస్ నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. "ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడితే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ మాకు మొండిచేయి చూపిస్తున్నారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను బయటకు పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఈ గొడవకు మూలకారణం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సామేల్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరే. గతంలో తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దామోదర్ రెడ్డి, నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడంతో సూర్యాపేటకు మకాం మార్చారు. కానీ, తుంగతుర్తిలో పార్టీ పగ్గాలు మాత్రం ఆయన చేతుల్లోనే ఉన్నాయి. మండల, గ్రామ కమిటీలు, స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు వంటి అన్ని వ్యవహారాల్లోనూ ఆయన వర్గం ఆధిపత్యం చెలాయిస్తోంది.

అయితే, గత ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని విజయం సాధించిన సామేల్‌ను దామోదర్ రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన సామేల్, పాత కాంగ్రెస్ నేతలను పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. తన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి తుంగతుర్తిలో ప్రజాదర్బార్ నిర్వహించి కార్యకర్తలకు అండగా ఉంటారని దామోదర్ రెడ్డి ప్రకటించడం ఈ విభేదాలను మరింత రాజుకుంది. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ సైతం సామేల్‌పై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్‌లో పాత, కొత్త నేతల మధ్య నెలకొన్న ఈ కుంపటి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.





Next Story