పనిచేసేది ముగ్గురు.. జీతం నలుగురికా?

by Kodari Anjali |

అనంతగిరి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికుల వేతనాల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పనిచేసేది ముగ్గురు.. జీతం నలుగురికా?
X

దిశ, అనంతగిరి: అనంతగిరి మండలంలోని ఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికుల వేతనాల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో ప్రస్తుతం ముగ్గురు పారిశుద్ధ కార్మికులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఆన్లైన్ రికార్డుల ప్రకారం, నలుగురు సిబ్బంది ఉన్నట్లు నమోదై ఉండటంతో మే నెల వేతనాలు నలుగురి ఖాతాలకు క్రెడిట్ అయినట్లు సమాచారం. గ్రామ పంచాయతీ అధికారుల వివరాల ప్రకారం, గతంలో పనిచేసిన ఓ పారిశుద్ధ కార్మికుడిపై కేసు నమోదుకావడంతో అతడిని విధుల నుంచి హోల్డ్‌లో పెట్టారు. అనంతరం అతడిని తొలగించాలని ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా సమాచారం పంపినట్లు తెలిపారు. అయితే సంబంధిత ఆన్‌లైన్ వ్యవస్థలో పేరు తొలగించే లేదా సవరణ చేసే అవకాశం లేకపోవడంతో అతని పేరు ఇప్పటికీ ప్రభుత్వ ఆన్లైన్ రికార్డుల్లో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గడిచిన కొన్ని నెలలుగా పారిశుద్ధ కార్మికుల వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో గ్రామ పంచాయతీ నిధుల నుంచే విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులకు జీతాలు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రభుత్వం ప్రతినెలా మొదటి తేదీన సిబ్బంది ఖాతాలకు నేరుగా వేతనాలు జమ చేసే విధానాన్ని అమలు చేయడంతో, ఆన్లైన్ రికార్డుల్లో నలుగురు సిబ్బంది ఉన్నట్లు నమోదై ఉండటం వల్ల మే నెల వేతనం నాలుగో వ్యక్తి ఖాతాకు కూడా క్రెడిట్ అయినట్లు తెలిపారు.

Next Story