బీజేపీ ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Disha Web Desk 11 |
బీజేపీ ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, నేరేడుచర్ల: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, ఇదే చివరి బడ్జెట్ అవుతుందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు రావలసిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ, బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, అవేవీ కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా పట్టించుకోవట్లేదని ఆరోపించారు.

బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేసినా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం గమనార్హం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని గప్పాలు కొడుతున్నారని, కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయానికి కరెంట్ ఎప్పుడు వచ్చి, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దీనిపై అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అంతు లేకుండా పోయిందన్నారు. ఈ మధ్యకాలంలో మఠంపల్లి మండలంలోని రఘునాధపాలెంలో గల ముగ్గు మిల్లుల నుంచి స్థానిక సీఐ, ఎస్ఐలు, అధికార పార్టీ నాయకులు కలిసి ఒక్కొక్క మిల్లు నుంచి లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారని, మొత్తం రూ.16లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. వీటిలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎంత కమిషన్ వెళ్తుందో చెప్పాలన్నారు. స్థానిక సీఐ, ఎస్ఐలు అధికార పార్టీ ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.



Next Story

Most Viewed