బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తుంది: తమ్మినేని

by Dishanational1 |
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పనిచేస్తుంది: తమ్మినేని
X

దిశ, మాడుగులపల్లి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేటర్ల కోసమే పని చేస్తుందని, పేద ప్రజలను పట్టించుకోవడంలేదని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సీపీఎం పార్టీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తుందని, రాష్ట్రంలో అధికారం కోసం రాజకీయంగా దిగజారుతుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు రూ. లక్షల కోట్లు దోచిపెడుతుందని అన్నారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తే దేశమంతా కార్పొరేట్ వ్యవస్థ పరిపాలిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందని అన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు.

కేంద్ర, రాష్ట్ర భాజపా నాయకులు తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అందుకోసం వివిధ పార్టీల నాయకులను ఫిరాయింపులను ప్రోత్సహించడానికి సిద్ధమైందన్నారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని మిగిలినవారు రెండవ తరగతి పౌరులుగా గుర్తిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే హిందువుల దేశంగా ఉండాలని, మిగిలిన మతాల వారు ఉండే అవకాశంగా లేదని అన్నారు. ఈడీ, సీబీఐలను ఉపయోగించి ప్రత్యక్షంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారన్నారు. దానిలో భాగంగానే కవితపై ఈడీ దాడులు చేపడుతున్నారని ఆరోపించారు. బీజేపీని గద్దెదించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడంతో కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. బీజేపీని గద్దె దించడం కోసం కలిసి వచ్చే పార్టీలతో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. మార్చి 17 నుండి 29 వరకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ బండారం బయటపెట్టడానికి 33 జిల్లాల్లో జన చైతన్య యాత్రలను 15 రోజులపాటు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎర్రజెండా ఉద్యమ శక్తిగా ప్రాముఖ్యమైన శక్తిగా ఎదుగుతుందన్నారు.

సీపీఎం కార్యాలయాలు ఉద్యమ కేంద్రాలుగా పోరాటాల నిలయంగా, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో కమ్యూనిస్టుల పాత్ర ఎంత అవసరం ఉందని, ఇటివల జరిగిన మునుగోడు ఎన్నికల ఫలితాలు రుజువు చేసిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు ప్రజలను చైతన్యం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరువుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేశం, సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, మహ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, నన్నూరి వెంకటరమణారెడ్డి, పద్మ, గోవర్ధన, గౌతమ్ రెడ్డి, రవి నాయక్, మంగారెడ్డి, రొండి శ్రీనివాస్, పుల్లెంల శ్రీకర్, మన్నెం బిక్షం, ఎర్ర కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed