ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి..

by Kodari Anjali |

ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు సందర్శించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.

ప్రైవేట్ స్కూళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి..
X

దిశ, హుజూర్ నగర్ టౌన్: ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు సందర్శించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం హుజూర్‌నగర్ మండల పరిధిలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను విద్యాశాఖ అధికారి భూక్యా సైదానాయక్ కు వినతిపత్రం అందజేసిన అనంతరం డీవైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షుడు ఇందిరాల నరేష్ మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలని, పాఠ్యపుస్తకాల విక్రయాలను నిలిపివేయాలని కోరారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించడం, ఫీజుల వివరాలను పాఠశాలల వద్ద ప్రదర్శించడం, ఫిట్‌నెస్‌ కలిగిన బస్సులు నడపడం, అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టడం వంటి అంశాలను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. అలాగే విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. యూనిఫాం, షూస్, టై, ఐడీ కార్డు, అడ్మిషన్ ఫీజుల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి లోహిత్, డీవైఎఫ్‌ఐ నాయకులు గోబ్బి అబ్రహం, రామాల అనిల్, నకినబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story