మాలనా..? మాదిగనా..??

by Disha Web Desk 22 |
మాలనా..? మాదిగనా..??
X

దిశ, తుంగతుర్తి: గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త అంశాలు నేడు వెలువడి రగులుతున్నాయి. మొదటి నుండి జనరల్ స్థానంలో కొనసాగుతున్న తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం 2009 లో ఎస్సీ రిజర్వుడు కోటాలోకి వెళ్ళింది. ఈ సందర్భంగా ఇప్పటికే మూడు దఫాలుగా జరిగిన (2009, 2014, 2018) శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీల తీరు ఒకరకంగా ఉంటే, ప్రస్తుతం (2023) జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి విచిత్రంగా మారాయి. ఎస్సీలలో ఉన్న మాల-మాదిగ అనే సామాజిక వర్గాల అంశాలు తెరపై కొచ్చి కాంగ్రెస్ పార్టీలో రగులుతున్నాయి. గతంలో రెండుసార్లు మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ అధిష్టానం ఈసారి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ టికెట్ కోసం పోటి పడుతున్న ఆశావాదులలో (మాదిగ) కొనసాగుతోంది. అంతేకాదు మాల సామాజిక వర్గం కంటే మాదిగ సామాజిక వర్గ ఓటర్లే ఎక్కువగా ఉన్నారంటూ లెక్కలు తీస్తున్నారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని మోత్కూర్, అడ్డగూడూరు, శాలిగౌరారం, తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలలో మొత్తంగా 60 వేల పై చిలుకు మాదిగ సామాజిక వర్గానికి ఉన్నాయంటూ వారు వివరిస్తున్నారు. ఇక మాల సామాజిక వర్గానికి వచ్చేసరికి దాదాపు 15 వేల వరకే ఓట్లు ఉన్నాయంటూ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మెజార్టీ ఉన్న తమ వర్గానికే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాదిగ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఇదే విషయంపై డీసీసీ, పీసీసీ లతో పాటు ఏఐసీసీకి వినతి పత్రాలు కూడా చేరాయి. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈసారి పోటీ చేసే అవకాశం మాల సామాజిక వర్గానికి ఇవ్వొద్దంటూ మాదిగ సామాజిక నేతలు వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు.

స్థానికుడా..? స్థానికేతరుడా..?

ఇక కాంగ్రెస్ పార్టీ ఆశావాదులు రెండో అంశాన్ని కూడా బలంగానే తెరపైకి తీసుకొచ్చారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన స్థానికులకే ఈసారి పోటీ చేసే అవకాశం కల్పించాలనే డిమాండ్ గత కొంతకాలంగా సాగుతోంది. దీనిపై అధికార బీఆర్ఎస్ పార్టీని మినహాయిస్తే మిగతా అన్ని పక్షాలు సైతం ఐక్యంగా సమావేశాలు నిర్వహించి స్థానికత అంశాన్ని వినిపించాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేతలైతే ఏకంగా జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీలకు వినతి పత్రాలు పంపాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్థానికేతరులకే పోటీ చేసే అవకాశం కల్పించిందని పేర్కొనడమే కాకుండా గత వివరాలను సైతం తోడుతూ పంపిన వినతి పత్రాలలో వివరించారు. ఈ రెండు అంశాలు ఇలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు కొంతమంది ఇప్పటికే తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా స్థానికులు- స్థానికేతరులు,వారి వల్ల లాభాలు-నష్టాలు అనే వాటిపై ప్రచారాలు కూడా జరుపుకున్నారు.

Next Story

Most Viewed