- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వినాశకాలే విపరీత బుద్ధి.. రాజగోపాల్రెడ్డి తీవ్ర ఆగ్రహం
తనపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన విమర్శలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: తనపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ చేసిన విమర్శలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "వినాశకాలే విపరీత బుద్ధి" అనే సామెత సామిల్ వైఖరికి సరిగ్గా సరిపోతుందని విమర్శించారు. గతంలో తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు సామెల్ కు టికెట్ ఇప్పించింది తానేనని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. “కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద తనకున్న పరిచయాలతో సామెలుకు టికెట్ తెప్పించి, సొంత నియోజకవర్గాన్ని వదిలి మరీ అతని గెలుపు కోసం ప్రచారం చేశానని అన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసిన తనపైనే ఈ రోజు అలాంటి వ్యాఖ్యలు చేయడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నా” అని వ్యాఖ్యానించారు. నాడు తనను నమ్మి సామెల్ గెలుపు కోసం కృషి చేసిన తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు ఆయన క్షమాపణలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనైనా పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, వారిని కాపాడుకునే బాధ్యత తనలాంటి సీనియర్ నాయకులపై ఉందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు సహనంతో ఉండాలని, ఎమ్మెల్యే సామెలును గౌరవిస్తూనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలెవరూ తొందరపడి సోషల్ మీడియాలోగానీ, బయటగానీ నిరసనలు తెలుపవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలందరికీ అండగా ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.






