నీళ్లు ఇవ్వలేదు... పరిహారమైన ఇవ్వండి

by Naveena |
నీళ్లు ఇవ్వలేదు... పరిహారమైన ఇవ్వండి
X

దిశ,తుంగతుర్తి: శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) కాల్వల ద్వారా సూర్యాపేట జిల్లాలోని సాగు పంటలకు నీళ్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని,తద్వారా ఆ పంటలన్నీ ఎండిపోయిన దృష్ట్యా సంబంధిత రైతాంగానికి నష్టపరిహారమైన చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.తుంగతుర్తి మండలం సూర్య తండ గ్రామ పరిధిలో ఉన్న ఎండిపోయిన పంట పొలాలను శనివారం ఆ పార్టీ ప్రతినిధులు అంతా కలిసి పరిశీలించారు. అక్కడి రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ తుంగతుర్తి మండల అధ్యక్షులు,మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. కాల్వాల ద్వారా నీళ్ళు వస్తాయనే ఆశతో రైతాంగం రబీ సీజన్ లో పెద్ద ఎత్తున వరి పంట సాగు చేసిందని పేర్కొన్నారు.అయితే వరి పంట పొట్ట మీద ఉంటూ చేతికి వచ్చే సమయంలోనే ప్రభుత్వం నీళ్ల విడుదల నిలిపిందని ఆందోళన వ్యక్తం చేశారు.తద్వారా వేలాది ఎకరాల్లో కళ్ళముందే పంట ఎండి పోతుంటే రైతు గుండె గుబెల్ మంటుందని అన్నారు.రైతు ఏడ్చిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు.పంటలకు సక్రమంగా నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై విమర్శలకు దిగడం సిగ్గుచేటు అన్నారు.మేడిగడ్డలో నీళ్లు ఆపకుండా అన్నారం,సుందిళ్ల ప్రాజెక్తులు నింపకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇసుక వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్సారెస్పీ జలాలతో చెరువులన్నీ నిండుకలతో సంతరించుకోవడమే కాకుండా పంటలన్నీ పుష్కలంగా పండాయని గుర్తు చేశారు.కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ లాకావత్ యాకూ,మాజీ ఎంపీటీసీ మాన్సింగ్,మంగు,బిక్షo,యాదగిరి,వెంకన్న,బద్దు,యాదగిరి తో పాటు మహిళా రైతులు పాల్గొన్నారు.



Next Story