"సర్" ను పారదర్శకంగా నిర్వహించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

by Kodari Anjali |

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

సర్ ను పారదర్శకంగా నిర్వహించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
X

దిశ, ఆత్మకూరు(ఎం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో 100 శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బూత్ లెవల్ ఏజెంట్లను అభినందించి రూ.5 వేల ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా తప్పులులేని ఓటరు జాబితాను రూపొందించాలని సూచించారు. బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను నిశితంగా పరిశీలించి నిర్ణీత గడువులోపు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా అత్యంత కీలకమని, బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేసి అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చేలా కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడుతూ, పారదర్శకత, ఖచ్చితత్వంతో సవరణ ప్రక్రియను నిర్వహించి ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందడి అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ మంగమ్మ శ్రీశైలం, మాజీ జడ్పీటీసీ నరేందర్ గుప్తా, సర్పంచులు ఉపేందర్‌రెడ్డి, బీరప్ప, ఎల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జన్నాయికోడే నగేష్, ఉపసర్పంచులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story