నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యాసంస్థల బంద్ విజయవంతం

by Kodari Anjali |

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు తెలిపారు.

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యాసంస్థల బంద్ విజయవంతం
X

దిశ, అశ్వాపురం: మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈనపల్లి పవన్ సాయి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీ దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసిందన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ నిర్వహించి, కుట్రలో పాల్గొన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపార వస్తువుగా కాకుండా విద్యార్థుల హక్కుగా గుర్తించి, వారి భవిష్యత్తును కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతాయని ఈనపల్లి పవన్ సాయి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అక్కనపల్లి నాగేంద్రబాబు, ఏఐఎస్ఎఫ్ మండలం నాయకులు, ఈనపల్లి గణేష్, ఉపేందర్, నిఖిల్, గజినీ, కార్తీక్, సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story