ఏ పరిస్థితుల్లోనైనా కరోనా ను ఎదుర్కొంటాం: మంత్రి జగదీష్ రెడ్డి

by Web Desk |
ఏ పరిస్థితుల్లోనైనా కరోనా ను ఎదుర్కొంటాం: మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: కోవిడ్ నియంత్రణ కు, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి తో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని మంత్రి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ చాంబర్‌లో కొవిడ్, ఒమిక్రాన్, వ్యాక్సినేషన్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాను అరికట్టేందుకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ లో 99.83 శాతం, రెండవ డోస్ 70.53 శాతం అలాగే 15 నుంచి 17 ఏండ్ల వయస్సున్న వారికి 61.42 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు.

ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వ్యాధి గ్రస్తులకు ముందు జాగ్రత్తగా 5995 మందికి బూస్టర్ డోస్ వేసి నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 614 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి తో పాటు, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీల్లో కొవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా పరీక్షల కిట్లకు, ఐసోలేషన్ కిట్లకు కొరత లేదని స్పష్టం చేశారు.

అనంతరం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. నకిరేకల్ ఏరియా ఆసుపత్రి‌లో కరోనా రోగులకు వైద్య చికిత్స అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పరిస్థితులు మెరుగు పరచాలని సూచించారు. అలాగే నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి‌లో డయాలసీస్ రోగులకు ప్రస్థుతం ఉన్న 10 పడకలతో పాటు మరో 10 పడకలు పెంచాలని కోరారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ.. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి‌లో డయాలసీస్ రోగులకు ప్రస్తుతం ఉన్న 5 బెడ్ లకు మరో 5 బెడ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు.

దేవరకొండ ఏరియా ఆసుపత్రికి డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని దేవరకొండఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కోరారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై సూచించిన వాటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల ప్రకారం కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బెడ్ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు.

కరోనా, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మేల్సీ ఎంసీ కోటి రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు, డి.సి.హెచ్.ఎస్ డా మాతృ, వైద్య అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed