ఆరవ రోజుకు చేరిన ఇరుసుమండ ఓఎన్‌జీసీ మంటలు: ఆందోళనలో కోనసీమ

by Malleboina Mahesh |

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ (ONGC) మోరి-5 గ్యాస్ బావి వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆరవ రోజుకు చేరిన ఇరుసుమండ ఓఎన్‌జీసీ మంటలు: ఆందోళనలో కోనసీమ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ (ONGC) మోరి-5 గ్యాస్ బావి వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత మంటలు ఆరవ రోజు కూడా కొనసాగుతున్నాయి. జనవరి 5న మరమ్మతు పనుల సమయంలో గ్యాస్ లీక్ అవ్వడంతో ఈ ప్రమాదం సంభవించింది. భారీ శబ్దంతో ఎగసిపడుతున్న అగ్ని కీలలు సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఇప్పటికే ఇరుసుమండ, లక్కవరం తదితర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మంటలను అదుపు చేసేందుకు ఓఎన్‌జీసీ క్రైసిస్ మేనేజ్‌మెంట్ బృందాలతో పాటు అంతర్జాతీయ నిపుణులు, డీప్ ఇండస్ట్రీస్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. బావి చుట్టూ ఉన్న శిథిలాలను తొలగించి, 'వాటర్ అంబ్రెల్లా' (నీటి కవచం) ద్వారా కూలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మంటల తీవ్రతను తగ్గించిన తర్వాతే బావికి క్యాపింగ్ (capping) చేయగలుగుతామని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించి, బాధితులకు తక్షణ సాయం, పంట నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story