మూసీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డేది..?

by Disha Web Desk 12 |
మూసీ నదిలో అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డేది..?
X

దిశ, నిఘా బ్యూరో: పాలకుల పట్టింపులేని తనం.. అధికారుల అలసత్వం.. వెరసి కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా సహజ వనరులను కొల్లగొట్టి.. రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. నిత్యం వందల లారీల్లో అక్రమంగా ఇసుకను తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఫలితంగా వాగులు, వంకలు.. నదులు నిర్వీర్య మవుతున్నాయి. బోరు బావులు ఎండిపోయి.. పచ్చని పంటపొలాలు బుగ్గి పాలవుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మూసీ నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడడం.. అమ్యామ్యాలకు అలవాటు పడడం.. రైతాంగానికి ఇబ్బందుల్ని తెచ్చిపెడుతోంది. ఇంత జరుగుతున్నా.. జిల్లా యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.

అనుమతులు లేకుండా తవ్వకాలు..

తుంగతుర్తి నియోజకవర్గ పరిధి నాగారం మండలం పేరబోయినగూడెంలో కొంతకాలంగా నిత్యం వందలాది లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ నిర్మాణాల కోసం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో కొన్ని ఇసుక రీచ్‌లను ప్రభుత్వం ఎంపిక చేసింది. వాటి ద్వారా ప్రభుత్వానికి డీడీ రూపంలో చెల్లించి లారీల్లో పగటిపూట మాత్రమే తీసుకెళ్లాలి. కానీ రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం వందల సంఖ్యలో లారీలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నాయి. అలాంటి వాటిలో లక్ష్మీదేవి కాల్వ ఒకటి. కానీ మూసీ నది ఇవతల ఉన్న నాగారం మండలం మారబోయిన గూడెం పరిధిలోని మూసీ నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఎవరైనా అడిగితే.. నది అవతలి వైపు ఉన్న లక్ష్మీదేవి కాల్వ నుంచి తీసుకొస్తున్నామంటూ బుకాయిస్తుండడం గమనార్హం.

అయితే వరంగల్‌కు.. లేకుంటే హైదరాబాద్‌కు..

నిజానికి ఈ ఇసుక రీచ్‌ల్లోని సాండ్‌ను ఇటు బస్వాపూర్ రిజర్వాయర్, దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి తరలించాల్సి ఉంది. కానీ అక్రమార్కులు వీలైతే హైదరాబాద్‌కు.. లేకుంటే వరంగల్‌కు తరలిస్తున్నారు. నకిరేకల్ టూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మల్లంపల్లి వరకు నిర్మించిన సీసీ జాతీయ రహదారి మూసీ నది మీదుగా వెళ్లడం అక్రమార్కులకు వరంగా మారింది.

ఇసుక మాఫియా వెనుక ఉన్నదెవరు..?

అక్రమంగా ఇసుక తరలించడం వెనుక తుంగతుర్తి నియోజకవర్గంలో ఏకంగా మాఫియానే తయారైనట్లు సమాచారం. స్థానికులు అక్రమ ఇసుక తరలింపును అడ్డుకున్నా.. ప్రశ్నించినా.. వారిపై భౌతిక దాడులు, అక్రమ కేసులు ఇక్కడ నిత్య కృత్యమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నియోజకవర్గంలోని ఓ గ్రామం నుండి ఇసుక తరలింపునకు అడ్డు రాకుండా ఉండేందుకు సదరు గ్రామంలోని పెద్దమనుషులతో ఏకంగా రూ.20 లక్షల ఒప్పందం కుదిరినట్టు సమాచారం.

Next Story