శవాల మీద కూడా బీమా మాఫియా దందా..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కోదాడ : శవాల మీద కూడా దందా చేసే స్థాయికి బీమా మాఫియా దిగజారిందనే ఆరోపణలు కోదాడ మున్సిపాలిటీ

శవాల మీద కూడా బీమా మాఫియా దందా..!
X

దిశ‌, కోదాడ : శవాల మీద కూడా దందా చేసే స్థాయికి బీమా మాఫియా దిగజారిందనే ఆరోపణలు కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో కలకలం రేపుతున్నాయి. గ్రామానికి చెందిన ఎస్‌కే ముంతాజ్ బేగం తండ్రి మౌలాలి) 12-04-2022న మృతి చెందగా.. ఆమె పేరుతో ఉన్న ప్రభుత్వ బీమా పాలసీని ఆధారంగా చేసుకుని కొందరు వ్యక్తులు ముందే పథకం రచించి రూ.2.5 లక్షల క్లెయిమ్‌ను దోచుకున్నారని బాధిత కుటుంబం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఎస్‌కే నసీమ (భర్త కరీం) తెలిపిన వివరాల ప్రకారం… ముంతాజ్ బేగం జీవించి ఉన్న సమయంలోనే కొందరు వ్యక్తులు “లేబర్ కార్డు చేయిస్తాం, ప్రభుత్వ పథకాల లబ్ధులు వస్తాయి” అంటూ నమ్మించి రూ.5,000 నగదు తీసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత లేబర్ కార్డు మాట మరిచి, ప్రశ్నించిన ప్రతిసారి తప్పించుకునే సమాధానాలు చెప్పారని ఆరోపించారు. తమ ఇంటికి బీమా అధికారులమని చెప్పుకున్న వ్యక్తులు వచ్చి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద రూ.2,50,000 చెక్కు వచ్చిందని చెప్పడంతో అసలు మోసం బయటపడిందని నసీమ పేర్కొన్నారు.


విచారణ చేయగా.. షాకింగ్ నిజాలువెలుగుచూశాయని తెలిపారు. మృతురాలు ముంతాజ్ బేగం పేరుతో ఉన్న బీమా పాలసీకి సంబంధించి, ఆమె జీవించి ఉన్నప్పుడు తీసుకున్న పత్రాలను అక్రమంగా ఉపయోగించి, ఆమె మృతి చెందిన తర్వాత అసలు నామినీగా ఉన్న నసీమ పేరును తొలగించి, అదే పేరుతో ఉన్న మరో మహిళను నామినీగా నమోదు చేసి బీమా క్లెయిమ్ చేసుకున్నట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం తమకు తెలియకుండానే జరిగిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఒంటరి ఘటన కాదని, గ్రామంలో అమాయక ప్రజలను టార్గెట్ చేసి ప్రభుత్వ పథకాలు, బీమాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నముఠాకార్యకలాపమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు నసీమ స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

Next Story