గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

by Taduka Kalyani |

సూర్యాపేట పరిధిలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
X

దిశ,సూర్యాపేట; సూర్యాపేట పరిధిలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, నాణ్యమైన విద్య అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో చదివి తమ భవిష్యత్తు కు బలమైన పునాది వేసుకోవాలని కలెక్టర్ అన్నారు. తనిఖీలో భాగంగా ముందుగా కిచెన్ రూమ్, డైనింగ్ హాల్, వెజిటబుల్ రూమ్, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు నిల్వ చేసే గదులను పరిశీలించారు. సరుకుల నిల్వ విధానం, పరిశుభ్రత, నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కూరగాయలను, సరుకులను నాణ్యత దెబ్బతినకుండా వెలుతురు తగిలే విధంగా ఎత్తైన ప్రదేశంలో భద్రపరచాలని, గుడ్లను ఎక్కువ కాలం నిల్వ చేయకుండా అవసరానికి అనుగుణంగా స్టాక్ పెట్టుకోవాలని సూచించారు. వంటశాల, భోజనశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అనంతరం పదో తరగతి గది పరిశీలించిన జిల్లా కలెక్టర్, విద్యార్థులకు కొద్దిసేపు హిందీ పాఠాన్ని బోధించారు. విద్యార్థులతో మమేకమై పాఠ్యాంశాలపై అవగాహన కల్పిస్తూ, చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.

అనంతరం కంప్యూటర్ ల్యాబ్, ప్లేగ్రౌండ్‌ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, కంప్యూటర్ పరిజ్ఞానంలో కూడా అభివృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. ప్లేగ్రౌండ్‌ను విస్తరించాలని విద్యార్థులు కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. విద్యార్థులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం నాణ్యత సంతృప్తికరంగా ఉందని తెలిపారు. మెస్ కమిటీలు రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ప్రతిరోజు స్టాక్ వివరాలను నమోదు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించాలని, వారు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. టాయిలెట్స్, ఫ్యాన్లు, లైట్లు, డోర్లు ఏమైనా మైనర్ రిపేర్లు ఉంటే 15 రోజులలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు భవాని తదితరులు పాల్గొన్నారు.

Next Story