మేయర్లు, చైర్‌పర్సన్లకు పట్టణాభివృద్ధి మంత్రం చెప్పిన మున్సిపల్ శాఖ కార్యదర్శి

by Ramesh Naini |

పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేయడానికి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి అన్నారు.

మేయర్లు, చైర్‌పర్సన్లకు పట్టణాభివృద్ధి మంత్రం చెప్పిన మున్సిపల్ శాఖ కార్యదర్శి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణాల్లో అనేక అభివృద్ధి పనులు చేయడానికి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే.శ్రీదేవి అన్నారు. మేయర్/ఛైర్పర్సన్లలో ఒక దార్శనికత ఉండాలని సూచించారు. వరంగల్, హైదరాబాద్ రీజియన్స్ పరిధిలోని మేయర్స్, చైర్‌పర్సన్స్ కోసం ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని మెరిక్యూర్ హోటల్‌లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధుల నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించడం, పట్టణ పాలనలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే దిశగా మార్గదర్శనం చేయడం లక్ష్యంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ విధి విధానాల అమలు, ప్రజలతో అనుసంధానం, దీర్ఘకాలిక దార్శనికతతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థలోని పనులను ప్రాధాన్యత క్రమంలో చేసుకోవాలని, ఏ పని చేసిన మానవతా దృక్పథం ఉండాలని, ప్రజలకు మంచి చేయాలని ఉంటే చట్టం తప్పకుండా దారి చూపిస్తుందని, ఆర్థిక స్వావలంబన సాధించుకోని ప్రజల సేవలను మెరుగు పరిచే పథకాలను చేపట్టాలని కోరారు.

60 మందికి పైగా ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఒక రోజు అవగాహన కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్స్, చైర్‌పర్సన్స్ బాధ్యతలు, అధికారాలు, విధి నిర్వహణ విధానాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలు విధానం, నిధుల వినియోగం, వివిధ పట్టణ అభివృద్ధి పథకాలు, ప్రణాళికలపై మున్సిపల్ శాఖ సీనియర్ అధికారులు అవగాహన కల్పించారు. ప్రజా ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహనను పెంపొందించుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులుగా పట్టణ పాలనలో మరింత సమర్థతతో ముందుకు సాగేందుకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు సంపాదించుకున్నమని హర్షం వ్యక్తం చేశారు. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ ఎస్.భాస్కర్ రెడ్డి, డీటీసీపీ డైరెక్టర్ ఎస్.దేవేందర్ రెడ్డి, సీడీఎంఏ, ఎన్ఐయూఎం సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Next Story