మావోయిస్టులకు మరో దెబ్బ.. ఐదుగురు లొంగుబాటు

by Bhanu |

ములుగు జిల్లా పోలీసులు , సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా అమలు చేస్తున్న "పోరు కన్నా ఊరు మిన్న - మన ఊరికి తిరిగి రండి"

మావోయిస్టులకు మరో దెబ్బ.. ఐదుగురు లొంగుబాటు
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పోలీసులు , సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా అమలు చేస్తున్న "పోరు కన్నా ఊరు మిన్న - మన ఊరికి తిరిగి రండి" అనే అవగాహన కార్యక్రమం విశేష ఫలితాలను ఇస్తోంది. ఈ ఉద్యమ ప్రభావంతో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ శబరిష్ సమక్షంలో లొంగిపోయారు.

లొంగుబడ్డవారిలో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడు (ACM) హోదాలో ఉండగా, మిగిలిన నలుగురు మావోయిస్టు పార్టీ కార్యకర్తలుగా పనిచేసినవారు. వీరంతా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్ జిల్లాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన సభ్యుల్లో శ్యామల రాజేష్ @ఇతా (22), కద్తిల్దుమా (20), ఉకే జోగి (18), బొడిశే భీమా @మహేష్ (21), ముచాకి జోగి (16) అనే యువకులు, యువతులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ, "మావోయిస్టు ఉద్యమం ఆశించిన అభివృద్ధిని ఇవ్వకపోవడం, అడవుల్లో నిరంతరమైన పోలీసుల గస్తీలు, ఆదివాసీ ప్రజల సహకారం లేకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆహార కొరతలు – ఇవన్నీ లొంగుబాటుకు కారణమయ్యాయి" అని వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకం పెరగడంతో వారు శాంతియుత జీవితానికి మొగ్గుచూపారని పేర్కొన్నారు.

లొంగుబడిన వారికి ప్రాథమికంగా రూ.25,000 చొప్పున మొత్తం రూ.1,25,000 నగదు అందజేయగా, హోదాల ఆధారంగా మిగిలిన రూ.6.75 లక్షలు ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలపై ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. 2025 జనవరి నుండి ఇప్పటివరకు ములుగు జిల్లాలో మొత్తం 73 మంది మావోయిస్టులు లొంగుబడినట్టు ఎస్పీ తెలిపారు. ఇది శాంతి, అభివృద్ధి మార్గంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. "మావోయిస్టు భావజాలం మానుకుని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకొని స్థిరమైన జీవితం గడపండి" అని జిల్లా ఎస్పీ శబరిష్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story