సీనియారిటీ లిస్టు లేకుండా పదోన్నతులా?

by Disha Web Desk 2 |
సీనియారిటీ లిస్టు లేకుండా పదోన్నతులా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ పోస్టా? మల్టీ జోనల్ పోస్టా? నోటిఫికేషన్ మాత్రం మల్టీ జోనల్‌గా పేర్కొన్నారు. కానీ పదోన్నతుల్లో మాత్రం స్టేట్ పోస్టుగా భావిస్తున్నారంటూ కొందరు తహశీల్దార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియారిటీ జాబితా లేకుండా పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయమేమిటని ప్రశ్నిస్తున్నారు. అర్హులైన 100 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వాలంటూ తెలంగాణ ఎంప్లాయీస్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతున్నది. అయితే ఇప్పటికైతే 40 మంది జాబితాను రూపొందించినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో రెవెన్యూ వర్గాల్లో గందరగోళం నెలకొన్నది. తెలంగాణలో(జోన్ 5, జోన్ 6) ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ల సీనియారిటీ, మెరిట్ ర్యాంకింగ్ ని రూపొందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మెమో నం.25287, తేదీ.16.7.21 ద్వారా సీసీఎల్ఏను ఆదేశించారు.

అయితే అది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన అంశం కావడంతో ముందుకు సాగలేదు. దాంతో 2004 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 10 ద్వారా జోన్ 5, జోన్ 6 ద్వారా రీక్రూట్మెంట్ ద్వారా నియమితులైన ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ల సీనియారిటీ జాబితా, మెరిట్ ర్యాంకింగ్ ఇవ్వాలంటూ ఆగస్టు 30న ఏపీపీఎస్సీ సెక్రటరీకి సీసీఎల్ఏ నుంచి లేఖ వెళ్లింది. అక్కడి నుంచి ఇంకా ఎలాంటి జాబితా రాకముందే పదోన్నతుల జాబితా సిద్ధమైందంటూ లీకులు ఇచ్చారు. అదెలా సాధ్యమంటూ కొందరు తహశీల్దార్లు ఆశ్చర్యపోతున్నారు. మెరిట్ లిస్టు లేకుండానే ఏ విధంగా తహశీల్దార్లను డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఐతే మెరిట్ లిస్టు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో పదోన్నతుల జాబితా రూపొందించరని, అది వచ్చి ఉంటుందని ట్రెసా నాయకులు చెబుతున్నారు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్‌లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మల్టీ జోనల్‌గా చూపించారు. నియామకాలు మల్టీ జోనల్ 1, మల్టీ జోనల్ 2 గానే చేపట్టనున్నారు. అయతే తహశీల్దార్ల ప్రమోషన్ల అంశంలో మాత్రం రాష్ట్రం యూనిట్ గా పరిగణిస్తున్నారని ఓ తహశీల్దార్ ఆరోపించారు. అదే చోటు చేసుకుంటే మల్టీ జోనల్ 2 లోని వారికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందన్నారు. మల్టీ జోనల్ వారీగా ఖాళీలు గుర్తించినప్పుడు పదోన్నతులు కూడా అదే విధంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ రూపొందించిన నోటిఫికేషన్ ప్రకారమే పదోన్నతులు కూడా ఉండాల్సిందేనన్నారు. అలా కాకపోతే ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లే ఆస్కారం ఉంటుందని, దాని వల్ల మరింత జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

క్యాడర్ స్ట్రెంథ్ ఖరారు చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుల అవసరం చాలా ఉందని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి చెప్పారు. తాము కూడా 100 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. భూ సేకరణ, ఫారెస్ట్ ల్యాండ్ సెటిల్మెంట్ అంశాల్లో డిప్యూటీ కలెక్టర్ల అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆర్డీవోలతోనే చేయిస్తామంటున్నదన్నారు. ఉదాహారణకు రీజినల్ రింగ్ రోడ్డు కిందనే 26 మంది డిప్యూటీ కలెక్టర్ల అవసరం ఏర్పడిందన్నారు. అందుకే క్యాడర్ స్ట్రెంథ్ ని ఖరారు చేయడం ద్వారా రెవెన్యూ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు.



Next Story

Most Viewed