నాంపల్లిలో లక్ష బోగస్ ఓట్లు.. MP ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
నాంపల్లిలో లక్ష బోగస్ ఓట్లు.. MP ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు ఎంపీ ఉత్తమ్ కుమార్ రిక్వెస్ట్ చేశారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో ఎంపీ ఉత్తమ్ బృందం మంగళవారం సీఈవో రాజీవ్ కుమార్ టీమ్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ లిస్టుపై అభ్యంతరాలను ఈ నెల 19 వరకు తీసుకోవాలన్నారు. నాంపల్లిలో లక్ష ఓట్లు బోగస్ ఉన్నాయని ఎలక్షన్ కమిషన్‌కు వివరించామన్నారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యాన్ని అరికట్టాలని కోరినట్లు తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని పోలీస్ వాహనాల్లోనూ డబ్బులు వెళ్లినట్లు తమ అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. దీంతోనే ఈ సారి పకడ్భందీగా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండానే ప్రభుత్వానికి అవసరమైన అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయంలో కొత్త పథకాల జీవోలు ఇవ్వడం ఓటర్లను మభ్యపెట్టడమేనని చెప్పారు.

మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 40,333 అభ్యంతరాలను ఇంకా పరిశీలించాల్సి ఉన్నదన్నారు. ఆ తరువాతే ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేయాలన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వం సొంతానికి వాడుకుంటుందన్నారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. నాంపల్లి నియోజకవర్గంలో కేవలం ఏడాదిలోనే లక్ష బోగస్ ఓట్లను గుర్తించామన్నారు. 60 వేల ఇండ్లు ఉంటే.. ఎలక్షన్ లిస్టులో 90 వేలు ఇళ్లు ఎలా వచ్చాయని? ప్రశ్నించారు. ఇలాంటి తప్పిదాలపై సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Next Story