కేసీఆర్ లేకుంటే నేను నథింగ్.. కానీ, ఒకటి మాత్రం నిజం: ఎంపీ సంతోష్

by Disha Web Desk 2 |
కేసీఆర్ లేకుంటే నేను నథింగ్.. కానీ, ఒకటి మాత్రం నిజం: ఎంపీ సంతోష్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ఆగ్రహించడంతో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కలతచెంది తన సెల్ ఫోన్‌ను సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, పార్టీ కార్యక్రమాలకు సైతం క్రమంగా దూరం అవుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై సంతోష్ కుమార్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తన సన్నిహితుల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో సంతోష్ రావుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశాడని దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ఓ దినపత్రిక కథనానికి సంబంధించిన క్లిప్‌ను టీ-కాంగ్రెస్ బుధవారం ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ ప్రచారం ఇటు టీఆర్ఎస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో సంతోష్ కుమార్ రియాక్ట్ అయ్యారు. బుధవారం ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడిన సంతోష్ కుమార్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఎక్కడికి పోలేదని ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాన్నారు. తాను ఎప్పుడు తన నాయకుడు, తన జీవితానికి స్ఫూర్తి ప్రధాత, తన బాస్ అయిన సీఎం కేసీఆర్ సేవలోనే ఉంటానని అన్నారు. తాను ప్రగతి భవన్ నుండే మాట్లాడుతున్నానన్నారు.

తాను కేసీఆర్ గొప్ప సేవకుడిని మాత్రమే అని, ఈ అభిప్రాయాన్ని ఈ భూమ్మీద ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. జరుగుతున్న ప్రచారంపై కలత చెందిన సంతోష్.. నేను మనిషిని కాదా? తనకు హృదయం లేదా? తనకు బ్యాడ్ మూవ్మెంట్, ఆరోగ్య సమస్యలు ఉండవా అంటూ ప్రతిపక్షాల విమర్శలను ఖండించారు. పార్టీ కార్యక్రమాలకు క్రమంగా దూరం అవుతున్నాడనే మాటలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, తానెప్పుడు నాయకుడిగా అనుకోలేదని కేసీఆర్‌కు సేవ చేయడానికే పని చేస్తున్నాన్నారు. కేసీఆర్ లేకుంటే తాను నథింగ్ అని ఆయన ఆజ్ఞలనన్నిటినీ వినయంగా పాటించటమే తన జీవితంలో ఏకైక పని అన్నారు. కేసీఆర్ సేవలో తప్ప ఇతర అన్ని చోట్ల తాను ఉంటానని జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రత్యర్థుల రాజకీయ ఆకాంక్షలు ప్రజలను వ్యక్తిగతంగా కిందకు లాగేలా దిగజారకూడదని అభిప్రాయపడ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలపై దాని వెనుక జరుగుతున్న రాజకీయాలపై సంతోష్ కుమార్ స్పందించలేదు. 'ఏం జరగాల్సి ఉంటే అదే జరుగుతుందని' అని అన్నారు.

సీఎం కేసీఆర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుందనే ప్రచారంతో పార్టీలో ఏం జరుగుతుందనే ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం అయింది. అయితే తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని కేసీఆర్ సేవలోనే కొనసాగుతున్నాని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. ఆ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ నుంచి ఉన్న వ్యక్తుల లింకులు బయటకు లాగే ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రంలో సోదాలు నిర్వహించిన ఈడీ కరీంనగర్‌కు చెందిన వెన్నమనేని శ్రీనివాస రావు అనే వ్యక్తిని ప్రశ్నించింది. ఇతను టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కు సన్నిహితుడు అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే సంతోష్‌ను కేసీఆర్ మందలించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే టాక్ బయటకు రాగా అదంతా అబద్ధం అని సంతోష్ ఆ ప్రచారాన్ని ఖండించారు. అయితే తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదనే విషయాన్ని ఖండించిన సంతోష్ రావు.. ఈడీ దర్యాప్తులపై మాత్రం స్పందిచలేదు.

Next Story