హిమాన్షును చూసి కేసీఆర్, కేటీఆర్ నేర్చుకోవాలి.. ఎంపీ ఆర్ కృష్ణయ్య

by Dishafeatures2 |
హిమాన్షును చూసి కేసీఆర్, కేటీఆర్ నేర్చుకోవాలి.. ఎంపీ ఆర్ కృష్ణయ్య
X

తెలంగాణ బ్యూరో : గౌలిదొడ్డిలోని కేశవ నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను చూసి అన్ని వసతులు కల్పించిన హిమాన్షును చూసి తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ నేర్చుకోవాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య సూచించారు. రాష్ట్రంలో అలాంటి దుస్థితిలో చాలా పాఠశాలలు ఉన్నాయని.. వాటన్నింటిని ప్రభుత్వం బాగు చేయాలని అయన సూచించారు. గురువారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమంలో నిరుద్యోగులకు మద్దతుగా అయన ఆందోళనకు దిగి రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. 45 రోజుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీకి వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలను , మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేకపోవడం కారణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. టీచర్ల ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. టీచర్లు లేరనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడం లేదని తెలిపారు. పిల్లలు రావడం లేదనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని ఆరోపించారు.

Next Story

Most Viewed