‘ఈడీ విచారణలో నిజాయితీ లేదు.. ‘సుప్రీం’ ఉత్తర్వుల వరకూ హాజరుకాను’

by Disha Web Desk 2 |
‘ఈడీ విచారణలో నిజాయితీ లేదు.. ‘సుప్రీం’ ఉత్తర్వుల వరకూ హాజరుకాను’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరుపుతున్న విచారణలో నిజాయితీ లేదని, పారదర్శకంగా ఎంక్వయిరీ జరగడంలేదని, నిష్పక్షపాతంగా జరగడంలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఈ నెల 11న నన్ను విచారించిన సందర్భంగా స్వయంగా అనుభవించిన అంశాలు దీన్నే ధృవీకరిస్తున్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగే తీరులో ఈడీ వ్యవహరిస్తున్నదని, అందువల్లనే ఈ విచారణ నుంచి ఉపశమనం కలిగించాల్సిందిగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, దానిపై కోర్టు ఉత్తర్వులు వెలువడేంతవరకు వ్యక్తిగతంగా ఫిజికల్ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. అవసరమైతే తన ఇంట్లో విచారణకు సిద్ధమేనని తెలిపారు.

ఈ నెల 11న కవితను విచారించిన సందర్భంగానే తిరిగి ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆ ప్రకారం గురువారం హాజరుకావాల్సి ఉన్నా న్యాయవాదులతో సంప్రదింపులు జరిపిన కవిత తన న్యాయవాది సోమా భరత్‌ను తన ప్రతినిధిగా పంపారు. గత విచారణ సందర్భంగా జాయింట్ ఎంక్వయిరీ ఉంటుందంటూ ఈడీ తొలుత నోటీసుల్లో పేర్కొన్నా ఆ ప్రకారం జరగలేదని, తనను పక్కదారి పట్టించిందని మెయిల్ ద్వారా గురువారం ఉదయం పంపిన మెసేజ్‌లో కవిత ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఈ నెల 11న రాత్రి 8.30 గంటల వరకు తనను ఈడీ విచారించిందని, ఇది తన హక్కులకు భంగకరమైనదని పేర్కొన్నారు. ఆ కారణంగానే విచారణ నోటీసులను రద్దు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరినట్లు కవిత తాజా మెయిల్‌లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నదని, ఈ నెల 24న విచారణ జరగనున్నదని ఆ మెయిల్‌లో కవిత గుర్తుచేశారు. కోర్టు ఉత్తర్వులు రావాల్సి ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకుని తదుపరి విచారణ తేదీని ఖరారు చేయాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంధర్‌ను కోరారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను అనుభవించడం కోసం పిటిషన్ వేయడం కూడా తనకు ఉన్న ప్రాథమిక హక్కు అని ఆ మెయిల్‌లో కవిత నొక్కిచెప్పారు. మెయిల్ ద్వారా కవిత తన అభిప్రాయాన్ని ఈడీకి స్పష్టంగా చెప్పినా తదుపరి విచారణ ఈ నెల 20న ఉంటుందని, దానికి హాజరు కావాలని నోటీసు జారీ చేయడం గమనార్హం. ఈడీ విచారణకు హాజరు కావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ‘రూల్ ఆఫ్ లా’ అమలు పటిష్టంగా ఉండాలని తెలిపారు.

ఒక మహిళను విచారించాలనుకున్నప్పుడు ఈడీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని, కానీ కచ్చితంగా ఈడీ హెడ్ క్వార్టర్‌కు రావాలని ఒత్తిడి చేయడంపై సుప్రీంకోర్టులో 2018లోనే ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైందని, అది ఇంకా విచారణలోనే ఉన్నదని, ఆ కేసులో ఈడీ తరఫున కూడా వాదనలు జరిగాయని, అప్పుడు మహిళను విచారించాల్సి వస్తే తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేయబోమంటూ కోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని తాజా మెయిల్‌లో కవిత గుర్తుచేశారు.

గత విచారణ సందర్భంగా మరో వ్యక్తితో జాయింట్‌గా ఉంటుందని పేర్కొన్న ఈడీ చివరకు ఒంటరిగా మాత్రమే తనను ప్రశ్నించారని, ఇదే విషయాన్ని ఆఫీసు సిబ్బంది భానుప్రియ మీనాతో చర్చించానని, ప్లాన్ మారిందంటూ సమాధానం ఇచ్చారని కవిత గుర్తుచేశారు. విచారణకు హాజరయ్యేటప్పుడు ఫోన్‌ను తీసుకురావాలంటూ నోటీసులో ఈడీ ఎక్కడా పేర్కొనలేదని, అయినా అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ‘రైట్ టు ప్రైవసీ’కి విరుద్ధంగా తన ఫోన్‌లోని వివరాలను ఈడీ తన పరిధిలోకి తీసుకున్నదని, ఇది చట్టానికి విరుద్ధమైనదని, చివరకు తన చేత బలవంతంగా అండర్‌టేకింగ్‌ పత్రంపైన సంతకం తీసుకున్నారని గుర్తుచేశారు. లిక్కర్ స్కామ్ విషయంలో ప్రశ్నిస్తున్నందున ఆ కేసుతో తన ఫోన్‌కు ఉన్న సంబంధం గురించి ఈడీ వివరించలేదని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌లో ఉత్తర్వులు వెలువడేంత వరకు తదుపరి విచారణను వాయిదా వేయాలంటూ ఈడీని మెయిల్ ద్వారా కవిత కోరినప్పటికీ ఈ నెల 20న రావాల్సిందిగా నోటీసు జారీచేయడం గమనార్హం. ఆ నోటీసు ప్రకారం కవిత విచారణకు హాజరవుతారా.. లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. హాజరుకాని పక్షంలో ఈడీ ఎలా స్పందిస్తుందన్నది కూడా ఈడీకి సవాలుగా మారింది.


Next Story