ఎప్పుడూ రాజకీయాలేనా?.. బీసీలపై శ్రద్ధ లేదా?.. ఖర్గేకు MLC కవిత లేఖ

by Gantepaka Srikanth |

కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge) తెలంగాణ పర్యటనలకు వస్తోన్న వేళ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) లేఖ రాశారు.

ఎప్పుడూ రాజకీయాలేనా?.. బీసీలపై శ్రద్ధ లేదా?.. ఖర్గేకు MLC కవిత లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress) అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjuna Kharge) తెలంగాణ పర్యటనలకు వస్తోన్న వేళ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని లేఖలో పేర్కొన్నారు.

‘దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన బలహీనవర్గాలకు అనాదిగా విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీసీ సమాజం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్నాయి. ఈ ఉద్యమాలకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అసెంబ్లీ, కౌన్సిల్‌లలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ ఒక బిల్లు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నా పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ వాటి ఆమోదం కోసం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు.

స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి మీరు హైదరాబాద్‌కు వస్తున్నారు. స్థానిక సంస్థల్లో రాజకీయ లబ్ధి పొందడానికి శ్రద్ధ చూపుతోన్న మీరు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి మాత్రం చూపడం లేదు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి మీరు వ్యతిరేకమా..? మీ పార్టీ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై మీరు ఎందుకు ఒత్తిడి చేయడం లేదు? రాజ్యసభలో మీరు స్వయంగా ప్రతిపక్షనేతగా ఉన్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి బీసీలు అండగా నిలవాలంటే వెంటనే బీసీ బిల్లులకు కేంద్రం ఆమోదం తెలిపేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.




Next Story