మార్చి 16న రెండోసారి విచారణకు కవిత.. ఆ డాక్యుమెంట్లు తీసుకురావాలని ఈడీ ఆదేశం!

by Disha Web Desk 2 |
మార్చి 16న రెండోసారి విచారణకు కవిత.. ఆ డాక్యుమెంట్లు తీసుకురావాలని ఈడీ ఆదేశం!
X

ఢిల్లీలో ఈ నెల 11న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎంక్వయిరీ చేసిన ఈడీ.. 16వ తేదీన మళ్లీ రావాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ రోజున కవితను అధికారులు ఏం ప్రశ్నిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఆమె ఆర్థిక మూలాలపైనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే విచారణకు వచ్చే రోజున పలు డాక్యుమెంట్లు తీసుకురావాలని ఆమెను అధికారులు ఆదేశించినట్టు సమాచారం. స్కాంలో ముడుపుల రూపంలో రూ.100 కోట్ల సౌత్ గ్రూప్ నుంచి ఆప్ నేతలకు చేరినట్టు బలంగా ఆరోపిస్తున్న ఈడీ.. ఆ కోణం నుంచి కవిత ద్వారా మరిన్ని వివరాలను రాబట్టాలను భావిస్తున్నట్టు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కవితను తొలి రోజు (మార్చి 11న) తొమ్మిది గంటల పాటు విచారించిన ఈడీ ఈ నెల 16న మరో సారి ఎంక్వయిరీకి రావాలని ఆమెను ఆదేశించింది. మరి ఆ రోజు ఏయే వివరాలను ఈడీ రాబట్టనున్నదనేది ఆసక్తికరంగా మారింది. తొలిరోజున చేసిన ఎంక్వయిరీలో ఏయే అంశాలపై ఫోకస్ పెట్టిందనే విషయాన్ని అటు ఈడీ అధికారులుగానీ, ఇటు కవితగానీ వెల్లడించలేదు. అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్, సిసోడియా రిమాండ్ రిపోర్టుల్లో ఈడీ లేవనెత్తిన అంశాలపైనే కవితను ప్రశ్నించినట్టు దర్యాప్తు సంస్థ వర్గాల సమాచారం.

కవిత ఇచ్చిన సమాధానాలతో సరికొత్త సందేహాలు వచ్చాయని, వాటికి సంబంధించిన ఆధారాల(డాక్యుమెంటల్ ఎవిడెన్స్)ను మార్చి 16వ తేదీన తీసుకురావాల్సిందిగా ఆమెను ఆదేశించినట్టు తెలిసింది. ఆర్థిక అంశాల పరిధిలోనే ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నందున కవితకు సంబంధించిన ఆదాయ వివరాలు, వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా ఉన్నందున వాటి ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు తదితరాలను తేవాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయినవారు ఇచ్చిన వాంగ్మూలాలకు అనుగుణంగా కవిత నుంచి వివరాలు రాబట్టిన ఈడీ అధికారులు.. తాజాగా కస్టడీలో ఉన్న పిళ్లయ్, మనీశ్ సిసోడియా వెల్లడించే అంశాలను ఈ నెల 16న చేపట్టే విచారణలో కవిత దృష్టికి తీసుకెళ్లి మరింత లోతుగా వివరాలు రాబట్టే చాన్స్ ఉన్నట్టు తెలిసింది. పిళ్లయ్ కస్టడీ ఈ నెల 13న ముగియనుండగా సిసోడియా కస్టడీ ఈ నెల 17న ముగియనున్నది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాల్లో ఏయే అంశాలపై ఈడీ దృష్టి సారించిందనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు.

రూ.100 కోట్లపైనే ఎక్కువగా ఫోకస్?

లిక్కర్ స్కామ్‌లో గతేడాది డిసెంబరు 11న సీబీఐ హైదరాబాద్‌లోని కవిత నివాసానికి వచ్చి ఒక సాక్షిగా ఆమె నుంచి వివరాలను తీసుకున్నది. అదే రోజు రాత్రి అనూహ్యంగా సీఆర్‌‌పీసీలోని సెక్షన్ 91 ప్రకారం నోటీసులు జారీచేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి (2001 నుంచి) కవితకు సంబంధించిన కంపెనీల ఆస్తుల వివరాలను, ఆదాయపు పన్ను రిటన్‌ల వివరాలను సంవత్సరాలవారీగా తీసుకురావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు ఆమె సన్నిహితుల ద్వారా తెలిపింది. వాటన్నింటినీ వారాల వ్యవధిలోనే సీబీఐ అధికారులకు ఆమె అప్పగించినట్టు గుర్తుచేశారు. ఇప్పుడు మనీ లాండరింగ్ కోణం నుంచి దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఆర్థిక వివరాలను ఆమె నుంచి కోరడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ పాలసీలో నేరపూరితమైన కుట్రకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆర్థికపరమైన వివరాలను ఇవ్వాలని కోరడం వెనక కారణం ఏంటనేది అప్పట్లో చర్చకు దారితీసింది. అయినా వాటిని కవిత సమర్పించక తప్పలేదు. మనీ లాండరింగ్ ఉల్లంఘన, హవాలా లావాదేవీలు లాంటి ఆర్థిక అంశాల చుట్టూ ఈడీ దృష్టి పెట్టడంతో కవిత నుంచి వచ్చే డాక్యుమెంట్లతో ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆర్థిక వివరాలు, ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన రిటన్‌లోని వివరాలు, డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కంపెనీల ఫైనాన్షియల్ రిపోర్టులను ఈడీ విశ్లేషించనున్నది. లిక్కర్ స్కామ్‌లో రూ.100 కోట్ల మేర ముడుపులు సౌత్ గ్రూపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చేరినట్టు ఈడీ బలంగా ఆరోపిస్తున్నందున ఆ కోణం నుంచి కవిత ద్వారా వివరాలను రాబట్టాలనుకుంటున్నది. తొలి విచారణలో కవిత నుంచి నిర్దిష్టంగా ఏయే అంశాలకు సంబంధించి వివరాలు సేకరించారన్నది వెలుగులోకి రాలేదు. రెండో దఫా విచారణలో దేనిపైన ఈడీ దృష్టి పెట్టి మరింత లోతైన సమాధానాలను రాబడుతుందనేది కూడా ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. పిళ్లయ్, సిసోడియా నుంచి తాజా కస్టడీలో రాబట్టి వివరాలు కూడా రెండో ఎంక్వయిరీ సందర్భంగా కవిత ముందు ఈడీ ప్రస్తావిస్తుందా? అనేదీ చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపు తరఫున చేతులు మారిన రూ.100 కోట్ల విషయం ఆరా తీయడంపైనే ఈడీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. లెక్కల్లోకి రాకుండా ఈ డబ్బును ఎవరు, ఎలా సమకూర్చారన్నది రాబట్టాలనుకుంటున్నది.

ఇవి కూడా చదవండి : ‘బినామీ’ ఉపసంహరణ పిటిషన్‌పై ఉత్కంఠ.. పిళ్ళయ్ ఎలాంటి కారణాలు చూపిస్తారు?


Next Story

Most Viewed