ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికే అలా మాట్లాడటం సాధ్యం:MLC Kavitha Fire

by Disha Web Desk 19 |
ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికే అలా మాట్లాడటం సాధ్యం:MLC Kavitha Fire
X

దిశ, తెలంగాణ బ్యూరో: 60 ఏళ్ల పాలనలో అసెంబ్లీలో, పార్లమెంట్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆమె మండిపడ్డారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మహిళా బిల్లుపై వారి అధిష్టానాన్ని ఏ ఒక్క రోజైనా నిలదీశారా ? అని ప్రశ్నించారు.

మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, గాంధీ భవన్ గాడ్సే అయిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు.ఉత్తరప్రదేశ్‌లో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించామని సొల్లు కబుర్లు చెబుతున్న కాంగ్రెస్ నేతలు ఓడిపోయే రాష్ట్రంలో సీట్లు కేటాయించారన్నది గుర్తుంచుకోవాలన్నారు.

గెలిచిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహిళలకు 15 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే, ముగ్గురు గెలవగా, 18 మంది మంత్రుల్లో కేవలం ఒక్క మహిళకే అవకాశం ఇచ్చిందని, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు నీతులు చెబుతున్నారని అన్నారు. స్వార్ధపూరిత రాజకీయాల కోసం మహిళా రిజర్వేషన్ల బిల్లును దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ వాడుకుందన్నారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం చేయాలనే బీఆర్ఎస్ డిమాండ్‌ను కూడా వెకిలిగా మాట్లాడడం ఉద్యమకారుల మీద గన్ ఎత్తిన రేవంత్ రెడ్డికి మాత్రమే సాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ పార్టీ అయినా, ఏ రాష్ట్రం అయినా, మహిళలకు దక్కాల్సినన్ని స్థానాలు దక్కడం లేదనదే మహిళల ఆవేదన అన్నారు. రాజ్యాంగ పరంగానే మహిళల హక్కులు అమలు కావాలని, దానికి చిత్తశుద్దితో అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపు నిచ్చారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారికంగా ఆహ్వానం పంపానని కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదని.. కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు.


Next Story

Most Viewed