MLC Kavitha: ప్రధాని మోడీ, అదానీ ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్న బొమ్మలు

by Disha Web Desk 19 |
MLC Kavitha: ప్రధాని మోడీ, అదానీ ఒకే నాణేనికి రెండు వైపులా ఉన్న బొమ్మలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈడీ దాడులతో ప్రతిపక్షాలన్ని ఏకమవుతున్నాయన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్షాలను అహేళన చేయడం ప్రధాని నరేంద్ర మోడీకి కొత్తేమి కాదని.. ఇలా చేయడం వల్ల ప్రశ్నించకుండా ప్రతిపక్షాలను నిలువరించవచ్చని అనుకుంటున్నారని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. మోడీ, అదానీ ఒకే నాణేనికి ఉన్న రెండు బొమ్మలవంటి వారని.. దేశభక్తి ముసుగులో తన భక్తులను కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదానీ అక్రమాలపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

జేపీసీ ఇష్టం లేకుంటే కనీసం సుప్రీంకోర్టు జడ్జీతోనైనా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ పేరుతో కేంద్రం కాపీ కొట్టిందని.. అయితే ఈ స్కీమ్ నుంచి అనేక మంది లబ్దిదారులను తొలగించారని ఆరోపించారు. 11 కోట్ల మంది రైతులకు నగదు సాయం చేస్తున్నామని ప్రధాని పార్లమెంట్‌లో చెప్పారు. కానీ కేంద్రం 3.87 కోట్ల మంది రైతులకే నగదు సాయం అందిస్తోందన్నారు. ఎల్ఐసీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అని అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ 80 వేల కోట్ల పెట్టుబడి పెట్టిందన్నారు. ఈ విషయంలో ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేశారు. మోడీ పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.



Next Story