వేర్ ఈజ్ ఎమ్మెల్సీ కవిత.. నెలన్నరగా నో అడ్రస్!

by Disha Web Desk 2 |
వేర్ ఈజ్ ఎమ్మెల్సీ కవిత.. నెలన్నరగా నో అడ్రస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉండడం అటు బీఆర్ఎస్ పార్టీలో, ఇటు రాష్ట్ర ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మార్చి నెలలో మూడుసార్లు ఎంక్వయిరీకి హాజరై వచ్చిన తర్వాత ఇంటికి మాత్రమే పరిమితం కావడం, పబ్లిక్ ప్రోగ్రామ్‌లలో కనిపించకపోవడంతో అనుమానాలు తలెత్తాయి. గత నెల 11న కాలికి గాయమై మూడు వారాల పాటు రెస్టులో ఉన్న ఆమె ఈ నెల 10న కొండగట్టు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మదర్స్ డే సందర్భంగా తల్లితో కలిసి ముచ్చటించారు. కానీ ఈ నెల 17న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకాలేదు. ఆరోగ్యంగానే ఉన్నా ఎందుకు అటెండ్ కాలేదంటూ పార్టీ నేతలే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 21న నాందేడ్‌లో పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమానికి కేసీఆర్‌తో పాటు కవిత కూడా వెళ్తారనే వార్తలు వినిపించినా ఆమె హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. వచ్చే నెల 2 నుంచి జరిగే దశాబ్ది ఉత్సవాల్లోనైనా ఆమె పాల్గొంటారా అనే చర్చ జరుగుతున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా మార్చి 10న యాక్టివిటీని మొదలుపెట్టి, యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్నప్పటికీ కాలి గాయం కారణంగా ఆగిపోయింది.

లిక్కర్ కేసు దర్యాప్తు వల్లేనా?

ఢిల్లీ లిక్కర్ కేసులో మూడుసార్లు ఈడీ విచారణకు హాజరైన తర్వాత అటు సీబీఐ, ఇటు ఈడీ వరుస సప్లిమెంటరీ చార్జిషీట్లను దాఖలు చేస్తూ వస్తున్నాయి. వాటన్నింటిలో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆమెకు గతంలో వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. కవిత తరఫున అడ్వొకేట్ సోమా భరత్ కూడా రెండుసార్లు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు అటెండ్ అయ్యారు. అయతే ఈ నెల 27, 28 తేదీల్లో ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై స్పెషల్ జడ్జి తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఇదే సమయంలో కవిత అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితర పలువురు రకరకాల కామెంట్లు చేశారు. కవితను అరెస్టు చేయకపోతే బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని, బీఆర్ఎస్‌తో స్నేహం ఉందనే మెసేజ్ జనంలోకి వెళ్తుందనే కామెంట్లూ వినిపించాయి. వీటన్నింటి నేపథ్యంలో కవిత ఇంటికే పరిమితం కావడంపై చర్చ జరుగుతున్నది.

త్వరలో యాక్టివ్ అవుతారు..

అయితే అమెరికాలో చదువుతున్న పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ కోర్సు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ నెల 9న సిటీకి రావడంతో ఇంట్లో ఉండాల్సి వచ్చిందని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో మళ్లీ నిజామాబాద్ నియోజకవర్గంలో పర్యటన ఉంటుందని, ఆ తర్వాత నుంచి వరుసగా యాక్టివిటీస్ జరుగుతాయని సన్నిహిత వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కాగా ఈడీ ఎంక్వయిరీకి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించడానికి ఆ వర్గాలు సుముఖత వ్యక్తం చేయలేదు.


Next Story

Most Viewed