జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు.. విజయ వ్యూహాలకు కాంగ్రెస్ పదును

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-09 02:32:59  IST  )

జూబ్లీహిల్స్​ఉపఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు.. విజయ వ్యూహాలకు కాంగ్రెస్ పదును
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్​ఉపఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో వచ్చిన ఈ ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అటు రాజకీయవర్గాలు.. ఇటు అధికార పార్టీలోనూ నెలకొంది. ఫలితం తమకు అనుకూలంగా వస్తే సీఎం రేవంత్​రెడ్డి పాలనపై రాబోయే మూడేళ్లు ప్రజల్లో సానుకూల స్పందన ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. అందుకే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అనుబంధ సంఘాల నేతలు, ముఖ్యనేతలు, ఎంఐఎం, వామపక్షాల నేతలు జూబ్లీహిల్స్​ప్రచారంలో జోరు పెంచారు. మరికొద్ది గంటల్లో ముగించబోయే ప్రచారంలో ఆఖరి ప్రయత్నంగా ఓటర్లను కలిసి ఓటును అభ్యర్థిస్తున్నారు.

జూబ్లీహిల్స్ గెలిస్తే..

కాంగ్రెస్​ఎన్నడూ లేని విధంగా పార్టీ శ్రేణులను రంగంలోకి దింపింది. కాంగ్రెస్​తో పాటు ఎంఐఎం, వామపక్ష నేతలు కాంగ్రెస్​అభ్యర్ధి నవీన్​యాదవ్​కు మద్దతుగా ప్రచారంలోకి దిగారు. పలు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. బీసీ బిడ్డకు ఓటు వేయాలని ఆ సంఘం నేతలు కోరుతున్నారు. జూబ్లీహిల్స్​లో గెలుపు ద్వారా ప్రత్యర్థిపార్టీల దూకుడును అడ్డుకుంటే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాజకీయంగా పాజిటివ్ వాతావరణం ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేతలు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ పోల్​మేనేజ్ మెంట్​చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి. ఏడు డివిజన్లలో ఆయా సామాజిక వర్గాల ఓటర్లను ప్రభావితం చేసే సంఘాలు, నేతల సమన్వయంతో మంత్రులు, ముఖ్యనేతలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటింగ్​ను ప్రభావితం చేసే వర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. డివిజన్లలో ఏళ్ల నెలకొన్న సమస్యల తీరుస్తామని, అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని స్థానికుల్లో నమ్మకం కలిగించేలా భరోసా కల్పిస్తున్నారు.

స్థానిక నేతలకు బాధ్యతలు

ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలకు బాధ్యతలు ఇచ్చి ప్రచారం చేయిస్తున్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం, హైదరాబాద్ నగరంలో కీలకమైన మజ్లిస్​మద్దతు పొందడం, ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారాలు చేయడం, సీఎంతో పాటు ప్రచారంలో ప్రసంగించడం వంటి అంశాలు కాంగ్రెస్ కు మరింత కలిసొచ్చే అంశాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలోని క్రైస్తవ సంఘాలతో మంత్రులు సమావేశాలు నిర్వహించారు. ఇక కుల సంఘాలతోనూ ఆత్మీయ భేటీలు జరుపుతున్నారు. ఇలా ఉపఎన్నికలో విజయం సాధించేందుకు అధికారపార్టీ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. విజయానికి అడుగు దూరంలో ఉన్నామని భావిస్తున్నారు.

Next Story