ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీఎం కేసీఆర్‌పై సుప్రీంకోర్టు సీరియస్

by Disha Web Desk 2 |
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీఎం కేసీఆర్‌పై సుప్రీంకోర్టు సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్ నుండి సీబీఐకి అప్పగించిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎం అనుసరించిన పద్ధతి సరైంది కాదని సూచించింది. కేసు ఆడియోలు, వీడియోలను ఆయన ఎలా న్యాయమూర్తులకు పంపిస్తారని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అరవింద్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలంగాణ సర్కార్ తరపున న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆడియో, వీడియో క్లిప్పులను సుప్రీంకోర్టు జడ్జిలు సహా దేశంలోని ప్రముఖులకు కేసీఆర్ పంపారు. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సీబీఐ చేతిలోకి కేసు వెళ్తే ఇప్పటి వరకు చేసిన విచారణ అంతా పక్కదారి పడుతుందని ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూత్రా, దుష్యంత్ దవేలు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి ఇవ్వొద్దని దవే కోరారు.

ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదించేందుకు త‌న‌కు మరింత సమయం కావాలని కోరారు. మరోవైపు కేసులో కీలక ఆధారాలు లీక్ చేశారన్న విషయాన్ని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌ ఒకసారి సమర్థించి మరోసారి వ్యతిరేకించిందని తెలిపారు. మరోవైపు, సిట్ దర్యాప్తు జరుగుతుండగానే బీజేపీ నేతలు పిటిషన్‌ వేశారని.. దురుద్దేశపూర్వకంగానే సీబీఐ విచారణ కోరారని వాదించారు. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తే ఆధారాలు ధ్వంసమవుతాయని అన్నారు.

కేసు తదుపరి విచారణపై సందిగ్ధత

కేసు వాదనల నేపథ్యంలో కోర్టు సమయం ముగియడంతో ధర్మాసనం వాదనలు నిలిపివేసింది. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తదుపరి విచారణపై సందిగ్ధత నెలకొంది. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు కావడంతో ఈ నేపథ్యంలో శుక్రవారమే విచారణ చేపట్టాలని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. కానీ, శుక్రవారం విచారించటం సాధ్యం కాదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్‌ల ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో కేసును సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేసింది. తదుపరి విచారణపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ధర్మాసనం వెల్లడించింది. ఇక ఈ కేసు విచారణపై మరో బెంచ్ నియమిస్తారా? లేదా వెకేషన్ బెంచ్‌కి రిఫర్ చేస్తారా? అనేది సీజేఐ నిర్ణయిస్తారని జస్టిస్ బిఆర్ గవాయి అన్నారు.

Next Story