మాగంటి గోపీనాథ్కు కన్నీటి వీడ్కోలు.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి

by Ramesh Naini |

జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే మాగంటి గోపినాథ్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు.

మాగంటి గోపీనాథ్కు కన్నీటి వీడ్కోలు.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఎమ్యెల్యే మాగంటి గోపినాథ్‌ (MLA Maganti Gopinath) అంత్యక్రియలు ముగిశాయి. ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది. మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్ నగర్ మీదుగా అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తన అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు అధికార లాంచనాలతో పూర్తి అయ్యాయి. మాగంటి గోపీనాథ్‌ ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

మాగంటికి సీఎం రేవంత్, మంత్రుల నివాళి...

కాగా, అంతిమయాత్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సహా బీఆర్ఎస్ శ్రేణులు మాగంటి పాడె మోశారు. మాగంటి గోపినాథ్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఆయన పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేశ్ తన భార్య నారా బ్రాహ్మణి తదితర ప్రముఖ రాజకీయ నాయకులు మాగంటికి నివాళులు అర్పించారు.

Next Story