MLA లాస్యను వెంటాడిన మృత్యువు.. 60 రోజుల్లో మూడు ప్రమాదాలు.. ఇవాళ మృతి..!

by Satheesh |
MLA లాస్యను వెంటాడిన మృత్యువు.. 60 రోజుల్లో మూడు ప్రమాదాలు.. ఇవాళ మృతి..!
X

దిశ, వెబ్‌డెస్క్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్ చెరు సమీపంలో ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. అతి వేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపుతప్పి డీవైడర్‌ను కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కేవలం రెండు నెలల్లోనే లాస్య మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. అయితే, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లాస్య నందిత కాలం అంతగా కలిసిరాలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన 60 రోజుల్లోనే ఆమె వరుస ప్రమాదాలకు గురి అయ్యారు. గత నెలలో బోయిన్ పల్లిలోని ఓ ఆసుపత్రిలో లాస్య లిఫ్ట్ ప్రమాదానికి గురి అయ్యారు.

ఈ ప్రమాదం నుండి ఆమె స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఇదిలా ఉండగానే, ఈ నెల 13వ తేదీన లాస్య నందిత మరో ప్రమాదానికి గురి అయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన బీఆర్ఎస్ నల్లగొండలో భారీ బహిరంగా సభ నిర్వహించింది. ఈ సభకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా లాస్య కారు నార్కట్‌పల్లి వద్ద ప్రమాదానికి గురింది. ఈ ప్రమాదం నుండి కూడా ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో లాస్య నందిత కారు ఢీకొని ఓ హోంగార్డు మృతి చెందాడు. ఇదిలా ఉండగానే ఇవాళ మరోసారి లాస్య నందితను మృత్యువు వెంటాడింది.

ఆమె ప్రయాణిస్తోన్న కారు శుక్రవారం తెల్లవారుజూమున ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురి కాగా.. లాస్య నందిత అక్కడిక్కకడే మృతి చెందారు. మూడోసారి మృత్యువు ఆమెను వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండు నెలలకే వరుస ప్రమాదాలకు గురై.. చివరికి ఇవాళ మృతి చెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. గతేడాది ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య కంటోన్మెంట్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రికూతుర్లు మృతి చెందడంతో కంటోన్మెంట్‌లో విషాదం నెలకొంది.

Read More: లాస్య నందిత మృతికి కారణాలివే..!



Next Story

Most Viewed