కార్మికుల సమస్యలు పరిష్కరించదగినవే: ప్రభుత్వానికి కూనంనేని సూచన

by Gantepaka Srikanth |

సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం హెచ్చరించ‌డడం శోచనీయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, శాస‌న‌స‌భ్యులు కూనంనేని సాంబ‌శివ‌రావు అన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించదగినవే: ప్రభుత్వానికి కూనంనేని సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం హెచ్చరించ‌డడం శోచనీయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి, శాస‌న‌స‌భ్యులు కూనంనేని సాంబ‌శివ‌రావు అన్నారు. కార్మికుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటే వారికి అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. స‌మ్మె కార్మికుల ప్ర‌జాస్వామిక హ‌క్కు అని, అన్ని ర‌కాలుగా ప్రాతినిధ్యం త‌రువాతే అనివార్యంగా స‌మ్మెకు దిగార‌ని అన్నారు. ప్రతిష్టకు పోకుండా పట్టువిడుపులతో ఆర్టీసీ కార్మికులను చర్చకు ఆహ్వానించి వారి సమస్యల స‌త్వ‌రం పరిష్కరించాలని రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు కూడా కృషి చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు.

పీఆర్సీ చట్టబద్ధంగా అమలు చేసే అంశం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ప్రభుత్వానికి ఉండబోవని, గత ప్రభుత్వ కాలంలో రద్దు చేయబడిన గుర్తింపు యూనియ‌న్ ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేముందు వాటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని, వాటిని వెంటనే అమలు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కార్మికులు వారి సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని, అన్ని సంస్థల్లో కూడా యూనియన్లు ఉన్నాయని, ఆర్టీసీలో యూనియన్లకు అనుమతి ఇవ్వకపోవడం ఆలోచన అంతుపట్టడం లేదని సాంబశివరావు పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం ఇప్పుడున్న కమిటీతో కమిటీతో పరిష్కరించవచ్చని అన్నారు. ప్రభుత్వం పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Next Story