బిగ్ న్యూస్: టీ- కాంగ్రెస్‌కు మరో కొత్త తలనొప్పి.. వరుస ప్రకటనలతో కొరకరాని కొయ్యగా మారిన ‘జగ్గారెడ్డి’..!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: టీ- కాంగ్రెస్‌కు మరో కొత్త తలనొప్పి.. వరుస ప్రకటనలతో కొరకరాని కొయ్యగా మారిన ‘జగ్గారెడ్డి’..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొరకరాని కొయ్యగా మారుతున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోన్నది. నిత్యం వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. గతంలో అనేక వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా గాంధీ భవన్ రాజకీయాలు, రాహుల్ సభలు, పాదయాత్ర ఖర్చుపై ప్రస్తావిస్తూ కంటిన్యూగా మీడియా గ్రూప్‌లలో ప్రకటనలు విడుదల చేశారు.

‘‘2017 లో సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్​సభకు, ఇటీవల భారత్​జోడో యాత్ర సందర్భంగా చేసిన కార్యక్రమాలు, ర్యాలీలకు నేను పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేశాను. అయినా పార్టీలో గుర్తింపు లేకపోవడం బాధకరం. గాంధీభవన్‌లో ప్రశాంతత తొలగిపోయింది. ప్రెండ్లీ పాలిటిక్స్​కూడా కనుమరుగయ్యాయి” అంటూ జగ్గారెడ్డి మరోసారి తన అసంతృప్తి జ్వాలలను వెదజల్లారు.

ఇది ఇప్పుడు కాంగ్రెస్​పార్టీలో హాట్​టాపిక్‌గా మారింది. ఒక వైపు రాహుల్ సస్పెన్షన్‌పై గాంధీభవన్‌లో నిర్వహించిన సత్యగ్రహ దీక్షలో నేతలంతా బీజీగా ఉంటే.. జగ్గారెడ్డి మాత్రం తనకు నష్టం జరుగుతుందంటూ ప్రెస్ నోట్లను రిలీజ్ చేయడం గమనార్హం. జగ్గారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడే కొత్త కాదు. గతంలోనూ అనేక సార్లు పార్టీ లైన్‌ను క్రాస్​చేస్తూ విమర్శలు వర్షం కురిపించారు.

పార్టీలో సీనియర్​నేత కావడంతో టీపీసీసీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో జగ్గారెడ్డి నిత్యం వివాదస్పదన వ్యాఖ్యలు చేస్తూ కాలం ఎల్లదీస్తున్నట్లు గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. పార్టీ విషయాలను మీడియా, ఇతరుల ముందు షేర్​చేసుకోవద్దని గతంలో మాణిక్​రావు థాక్రే.. జగ్గారెడ్డి నిర్వహించిన రంజాన్​పార్టీకి హజరై సూచించారు. ఇంటర్నల్ అంశాలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పవద్దని నొక్కి చెప్పారు. కానీ జగ్గారెడ్డి మాత్రం తన వైఖరిని మార్చుకోకుండా పాత అంశాలను తెరమీదకు తెచ్చి యథావిథిగా వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అసంతృప్తా..?అవమానమా..?

థాక్రే ఎంట్రీ తర్వాత కాంగ్రెస్​పార్టీ పరిస్థితులు మారాయని భావించిన కేడర్‌ను జగ్గారెడ్డి మళ్లీ అసంతృప్తి పరిచారు. పలుమార్లు పార్టీ లైన్‌ను క్రాస్​చేస్తూ మాట్లాడితే.. స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో పాటు పలువురు ముఖ్యలు సర్ధిచెప్పారు. కొన్నాళ్ల పాటు కూల్‌గా ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ కీలకంగా తలపెట్టిన సత్యగ్రహ దీక్ష సమయంలో మళ్లీ కాంట్రవర్సీగా మాట్లాడారు.

అయితే తనకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని జగ్గారెడ్డి పైకి చెబుతున్నా.. అంతర్గతంగా ఏదో మనసులో పెట్టుకొనే ఇలా వ్యవహరిస్తున్నారని గాంధీభవన్‌లో చర్చ జరుగుతున్నది. సమస్య ఉంటే టీపీపీసీ, ఢిల్లీలోని ఏఐసీసీకి ఫిర్యాదు చేయాలని, ఇలా బహిరంగంగా పార్టీకు నష్టం చేకూర్చే ప్రయత్నం చేయడం ఎంత వరకు కరెక్ట్​? అని పార్టీ కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొదట్నుంచి వ్యతిరేకమే..

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించినప్పటి నుంచి జగ్గారెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. రేవంత్‌కు పదవి రాకుండా జగ్గారెడ్డి తనదైన శైలీలో వివిధ రకాలుగా ప్రయత్నాలు చేశారని, గతంలో ఆ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి నేతలు ఆరోపించారు. రేవంత్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా జగ్గారెడ్డి విమర్శలకు చెక్​పడలేదు.

నిత్యం ఎదో ఒక కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నారు. పైగా ప్రభుత్వ తప్పిదాలపై సీరియస్‌గా పోరాటం చేసే సమయంలోనే జగ్గారెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తూ డిస్టర్బ్ చేస్తున్నాడని గాంధీభవన్‌లోని ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే అసలు జగ్గారెడ్డి తన పార్టీ కోసం పనిచేస్తున్నాడా? బీఆర్ఎస్‌కు లాభం చేకూర్చేందుకు ముందుకు వెళ్తున్నాడా? అనే ప్రశ్నలు కూడా కాంగ్రెస్​నేతల నుంచి వస్తున్నాయి.

ఇటీవల సంగారెడ్డి అభివృద్ధిని క్రోడీకరిస్తూ సీఎం కేసీఆర్, ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి పదే పదే అభినందించారు. దీంతో బీఆర్​ఎస్‌తో కూడా జగ్గారెడ్డి టచ్‌లో ఉన్నాడేమోనని కాంగ్రెస్​నేతలు అనుమానిస్తున్నారు. జగ్గారెడ్డి వరుసగా చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే రేవంత్ మీద ఇంకా తన కోపం చల్లారలేదనేది స్పష్టంగా అర్థం అవుతుందని గ్రౌండ్​లెవల్‌లో పార్టీ కోసం పనిచేసే సాధారణ కార్యకర్తలు కూడా చెప్పడం విశేషం. అయితే జగ్గారెడ్డి అసంతృప్తి జ్వలాలు ఇలాగే కొనసాగితే పార్టీ కేడర్‌కు నష్టం జరుగుతుందని, పరిష్కరానికి కృషి చేయాలని గాంధీ భవన్‌లోని ఓ కీలక నేత చెప్పారు.


Next Story