సచివాలయం లోనికి వెళ్లకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు

by Disha Web Desk 2 |
సచివాలయం లోనికి వెళ్లకుండా ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రెటేరియట్‌లోకి వెళ్ళడానికి ఉద్యోగులకే కాదు.. ఎమ్మెల్యేలకూ తిప్పలు తప్పలేదు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద ముఖ్యమంత్రి అధ్యక్షతన కొత్త సచివాలయంలో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొనేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మెయిన్ గేట్ దగ్గరికి చేరుకున్నారు. ఆ గేటు నుంచి కారులో లోపలికి వెళ్ళడానికి స్పెషల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సౌత్ ఈస్ట్ గేటు నుంచి వెళ్ళాలంటూ సూచించారు. కొత్త ఆంక్షలు నిజమేనని భావించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సౌత్ ఈస్ట్ గేటువైపు వెళ్ళారు. కానీ అక్కడ డ్యూటీలో ఉన్న స్పెషల్ పోలీసులు మాత్రం “ఎమ్మెల్యేల ఎంట్రీ నార్త్ ఈస్ట్ గేటు నుంచి.. అందుకే మీరు అటు నుంచి వెళ్ళండి..” అంటూ ఆయనకు సూచించారు. సంయమనంతోనే ఎమ్మెల్యే నార్త్ ఈస్ట్ గేట్ దగ్గరకు వెళ్ళారు. కారులో ఉన్నది ఎమ్మెల్యే అని తెలుసుకున్న పోలీసులు “ఈ గేటు హయ్యర్ అఫీషియల్స్ కు ఉద్దేశించింది.. ఎమ్మెల్యేల ఎంట్రెన్స్ ఇటువైపు కాదు..” అంటూ ఆయనను లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు.

షెడ్యూలు ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సమీక్షా సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండడంతో టైమ్‌కు చేరుకున్నా పోలీసుల ఆంక్షలతో లేట్ అవుతున్నదని ఎమ్మెల్యే ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. సెక్యూరిటీ అధికారులపై గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు. ఇంతకూ తాను వెళ్ళాల్సిన గేట్ ఏదో ఉన్నతాధికారులను కనుక్కుని చెప్పండి.. అంటూ అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయానికి భారీ పోలీసు భద్రత కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నా ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలో.. ఏ ఎంట్రీ నుంచి లోపలికి అనుమతించాలో డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులకేకాక ప్రజా ప్రతినిధులకూ చిక్కులు ఎదురవుతున్నాయి. మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి సైతం ఇదే తరహా చేదు అనుభవం ఎదురైంది. చివరకు వాదనల అనంతరం నార్త్ ఈస్ట్ గేట్ నుంచి ఎంట్రీ అయ్యారు.


Next Story

Most Viewed