సాంఘిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి

by Dishafeatures2 |
సాంఘిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సాంఘిక చైతన్యానికి నిలువెత్తు స్ఫూర్తి సురవరం ప్రతాప్ రెడ్డి అని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు. సురవరం ఒక కులానికి పరిమితం కాదని, దేశానికే పరితమైన వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ వైతాళికులు, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాప్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆదివారం ట్యాంక్ బండ్ పైన ఉన్న సురవరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భాష, సాహిత్యం, సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రాంత అభివృద్ధి కోసం సురవరం చేసిన కృషి ఎనలేనిదన్నారు. భూగర్భం నుంచి అంతరిక్షం వరకు.. సాహిత్యం నుంచి సైన్స్ వరకు సురవరం స్పృశించని అంశం లేదన్నారు. తెలంగాణ చైతన్యానికి ఆయన గొప్ప స్ఫూర్తి.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగువ్యక్తి అన్నారు. సురవరం సాహిత్యం ఒక మాటలో, ఒక ఉపన్యాసంలో వర్ణించలేమన్నారు. ఏకకాలంలో దళిత సంఘాలకు, వైశ్య సంఘాలు.. భిన్నమైన సామాజిక వర్గాలకు గౌరవ అధ్యక్షులుగా పని చేశారని తెలిపారు.

తొలిసారి వనపర్తి శాసనసభ్యులుగా ఎన్నికై కేవలం 12,13 మాసాలలోనే మరణించడం దురదృష్టకరంఅన్నారు. సురవరం జీవిత చరిత్ర మూడో తరానికి తెలియజేప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సురవరం సేవలు మరింత ప్రాచుర్యంలోకి రావాల్సిన అవసరం ఉందని,ఆయన రచనలను రెండు సంపుటాలుగా తీసుకొచ్చామని, మూడో సంపుటాన్ని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తీసుకొస్తామన్నారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన సురవరం జయంతి కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సరస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి కుమారుడు కృష్ణవర్ధన్ , కపిల్ సురవరం, ట్రస్ట్ కార్యదర్శి పుష్పలత, తెలంగాణ సాహిత్య పరిషత్ ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ చెన్నయ్య, కవులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed