జైపాల్‌రెడ్డికి భారత రత్న ఇవ్వాలి.. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన మంత్రులు, ప్రముఖులు

by Ramesh Naini |

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

జైపాల్‌రెడ్డికి భారత రత్న ఇవ్వాలి.. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన మంత్రులు, ప్రముఖులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి (Jaipal Reddy)కి భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జైపాల్ రెడ్డి వర్దంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్డులోని స్మారక ఘాట్‌లో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ నేత కె కేశవరావు, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆయన చేసిన సేవలకు గాను కేంద్రం ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌కు మెట్రో జైపాల్ రెడ్డి కృషి వల్లే వచ్చిందని చెప్పారు.

దేశం మొత్తం మీద నిజాయితీగా పని చేసిన వ్యక్తి అని, ఆయనను తెలంగాణ మరువదని చెప్పుకొచ్చారు. అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు గ్రహీత అయిన జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని, అలాగే నాగర్ కర్నూల్ జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. కాగా, జైపాల్‌రెడ్డి వర్దంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భార్య గీతా రెడ్డి, ఆయన కూతురు నైమిష రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

Next Story