టార్గెట్ ఫిక్స్.. అధికారులకు మంత్రి తలసాని కీలక ఆదేశం

by Disha Web Desk 19 |
టార్గెట్ ఫిక్స్.. అధికారులకు మంత్రి తలసాని కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మన బస్తీ-మన బడి పనులను కంప్లీట్ చేసేందుకు అధికారులకు ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. మే చివరినాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో శనివారం నారాయణగూడలో మన బస్తి మన బడి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడం ద్వారా విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరగాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

రాష్ట్రంలోని 26,065 పాఠశాలల్లో అభివృద్ధి పనులకోసం రూ.7,289 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మొదటి విడతలో 35 శాతంగా 9,123 పాఠశాలలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి రూ.3,497 కోట్లు విడుదల చేసిందన్నారు. పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణం, భవనాలకు పెయింటింగ్, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సరఫరా, టాయిలెట్స్ నిర్మాణం, ఫర్నీచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డు ఏర్పాటు వంటి పనులను చేపడుతున్నట్లు వివరించారు.

హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలలను అభివృద్ధి పనులను చేపట్టేందుకు రూ.44 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వివిధ కారణాలతో 198 పాఠశాలల్లో మాత్రమే పనులను చేపట్టినట్లు వివరించారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను మరింత వేగవంతం చేసి మే నాటికి పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ దేవసేన, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, విద్యాశాఖ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed