తెలంగాణలో త్వరలోనే ‘‘టెంట్ సిటీ’’: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 19 |
తెలంగాణలో త్వరలోనే ‘‘టెంట్ సిటీ’’: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వారణాసిలో గంగా నది ఒడ్డున ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో నిర్మించిన టెంట్ సిటీని ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ‘టెంట్ సిటీ’ తరహా టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్నగర్లో దేశంలోని రెండవ అతిపెద్ద ఎకో టూరిజం పార్క్ ‘కేసీఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్క్’, సోమశిల, అనంతగిరి హిల్స్, మల్లన్న సాగర్, లక్నవరం లాంటి ఎకో టూరిజం, ఫారెస్ట్ సఫారీ, అడ్వెంచర్ టూరిజం ప్రాంతాలలో టెంట్ సిటీ ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదుల వెంట అద్భుతమైన ప్రకృతి సౌందర్య మైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు.

వాటి అభివృద్ధికి ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు దేశంలోనే పర్యాటకులను ఆకర్షించడంలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని.. అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. అంతకు ముందు వారణాశి (కాశీ)లో కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్ తదితరులున్నారు.

Next Story

Most Viewed