BREAKING: కొత్త రేషన్ కార్డులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

by Disha Web Desk 19 |
BREAKING: కొత్త రేషన్ కార్డులపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతోందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు మొదలయ్యాయని.. గైడ్ లైన్స్, దరఖాస్తుకు చివరి తేదీ ఇదేనంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి శ్రీధర్ కీలక ప్రకటన చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజా పాలన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో శ్రీధర్ బాబు ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.

కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం.. పాత కార్డులను తీసేయడం వంటి ప్రక్రియ చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడుతుందని తెలిపారు. అయితే, కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని.. లబ్ధిదారుల ఎంపికకు ఇంకా గైడ్ లైన్స్ సిద్ధం కాలేదని కీలక ప్రకటన చేశారు. ఆశావహుల డాటా సేకరణ కోసమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఫించన్ వస్తోన్న వాళ్లు కొత్తగా మళ్లీ ఫించన్ కోసం అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలనుకునే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని.. అప్లికేషన్లలో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

Read More..

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు నగరాలు కంట్రీ కజిన్స్: మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే


Next Story